Assembly Elections 2023: కాంగ్రెస్లో ఉన్నప్పుడే బీజేపీతో మంచి సంబంధాలు ఉండేవి.. కేంద్రమంత్రి సిందియా సంచలన వ్యాఖ్యలు
శుక్రవారం చంబల్, గ్వాలియర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఆ ప్రాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు
- tony bekkal
- Published On : October 20, 2023 / 06:50 PM IST
Jyotiraditya Scindia: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి జ్యోతిరిదిత్య సిందియా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉండేవని, వాస్తవానికి బీజేపీ తనకు ఇల్లులాంటిదని అన్నారు. 2021లో తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటా ఎగరేసిన సిందియా.. అనంతరం బీజేపీలో చేరారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో సిందియా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనకు కాకుండా కమల నాథ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో ఏడాది తర్వాత పార్టీపై తిరుగుబాటు చేశారు.
శుక్రవారం చంబల్, గ్వాలియర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఆ ప్రాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. శివరాజ్ సింగ్ చౌహార్ 18 ఏళ్లుగా రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నారని, ఆయన వల్ల రాష్ట్ర రూపురేకలే మారిపోయానని సిందియా హర్షం వ్యక్తం చేశారు. బిమార్ మధ్యప్రదేశ్ ఇప్పుడు చింతలేని మధ్యప్రదేశ్ గా మారిందని అన్నారు. అలాగే రాష్ట్రంలో 11 వేలుగా ఉన్న పర్ క్యాపిటా ప్రస్తుతం 1.40 లక్షలకు చేరిందని, ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రం ప్రగతి పథంలో ఉందని సిందియా అన్నారు.
ఇది కూడా చదవండి: Assembly Elections 2023: హర్యానాలో బీజేపీతో జేజేపీ పొత్తు తెగినట్టేనా? రాజస్థాన్ ఎన్నికలపై దుశ్యంత్ ఏమన్నారు?
మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికల పోలింగ్ జరగనుంది. అనంతరం డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేస్తారు. 230 స్థానాలున్న ఆ రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంది. అయితే గోండ్వానా గణతంత్ర పార్టీతో బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకుని ఈ రెండు పార్టీలకు గట్టి పోటీనిచ్చే ప్రయత్నంలో ఉంది. కానీ, ఈ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందనేది ఎన్నికల్లో చూడాలి.
