Covid-19 Vaccination : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ రేపటి నుంచి మొదలు కానుండగా.. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్లు భద్రంగా చేరుకున్నాయి. తొలి రోజు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దాదాపు 3 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2 వేల 934 కేంద్రాల్లో ఈ టీకాలను అందించనున్నారు.
ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం పదిన్నరకు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్నారు. కోటి 65 లక్షల డోసులను ప్రభుత్వం సేకరించింది. వీటిలో కోటి పది లక్షల డోసులు కొవిషీల్డ్వి కాగా, మరో 55లక్షల డోసులను భారత్ బయోటెక్ అందించింది. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి మాత్రమే టీకా అందించనున్నారు. కో-విన్ యాప్ ద్వారా టీకా పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.
ఎక్కడ ఎంత వ్యాక్సిన్ నిల్వ ఉంది? ఇంకా ఎన్ని డోసులు అవసరం.. తదితర అంశాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే అధికారులు తెలుసుకోనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై తలెత్తే సందేహాలను నివృత్తిచేసేందుకు వీలుగా ప్రత్యేక కాల్సెంటర్ను ఏర్పాటు చేశారు.
ఇందుకోసం 1075 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణలో ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసి, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 139 కేంద్రాల్లో టీకాలు వేయాలని నిర్ణయించారు. ఇక ఏపీలో 332 కేంద్రాల్లో టీకాను వేయనున్నారు.