Dementia : అది పెద్దల చాదస్తం కాదు.. డిమెన్షియో.. మెదడులో నీరు చేరినా చికిత్సతో నయం చేయొచ్చు!
Dementia Problems : వైజాగ్కు చెందిన 73 ఏళ్ల శంకర్రావు ఏడు నెలలుగా డిమెన్షియోతో ఇబ్బంది పడుతున్నారు. మూత్రవిసర్జనపై ఆయనకు నియంత్రణ లేదు. సాధారణ నడక కన్నా చాలా నెమ్మదిగా నడుస్తున్నారు.
- Sreehari A
- Published On : June 19, 2024 / 10:53 PM IST
Dementia caused by fluid accumulation in brain treatable ( Image Source : Google )
Dementia Problems : ప్రస్తుత ఆధునిక జీవితంలో కొద్ది వయస్సు పెరగగానే డిమెన్షియా (మతిమరుపు) వ్యాధి కామన్ అయిపోయింది. ఈ మతిమరుపు కారణంగా నిమిషం కిందట తామేమి చేశారో అది గుర్తు ఉండదు. ఏదైనా పనిచేసినా చేయలేదని భావిస్తుంటారు. అదే పని పదేపదే చేస్తుంటారు. ఉదయం చేసిన పని సాయాంత్రానికి గుర్తు ఉండదు. తెలిసిన వారిని కూడా గుర్తుపట్టరు. ఇలా చేస్తే.. వయస్సు కారణంగా పెద్దవారిలో చాదస్తమని వారి పిల్లలు భావిస్తుంటారు. దాంతో వారిపై విసుక్కుంటారు. వాస్తవానికి అది చాదస్తం కాదని గమనించాలి. అది డిమెన్షియా అని గుర్తించాలి. సరైన సమయంలో చికిత్స చేస్తే తొందరగా నయం అవుతుంది.
Read Also : Apple Cheaper Vision Pro : అందుకే.. ఆపిల్ చౌకైన కొత్త విజన్ ప్రో తీసుకొస్తోంది.. ఐఫోన్ ధరతో సమానంగా ఉంటుందట!
అయితే, కొన్ని డిమెన్షియాలలో మరిన్ని సమస్యలు కూడా ఉంటాయి. ప్రత్యేకించి మూత్రాన్ని ఆపుకోలేరు. అందరూ నడిచే వేగం కన్నా చాలా నెమ్మదిగా నడుస్తుంటారు. ఇతరుల పేర్లు గుర్తుండవు. ఈ సమస్యలు ఉంటే పిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యపరమైన సమస్యగా గుర్తించి వెంటనే తగిన చికిత్స అందించాలని చెబుతున్నారు. ఇదే రకమైన సమస్యతో ఓ వృద్ధుడికి ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి వైద్యులు సర్జరీ చేసి డిమెన్షియోను క్యూర్ చేశారు. ఈ చికిత్స వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ రమేష్ పూర్తి వివరాలను వెల్లడించారు.
శంకర్రావు అనే 73ఏళ్ల వ్యక్తికి ఇదే వ్యాధి :
వైజాగ్కు చెందిన 73 ఏళ్ల శంకర్రావు ఏడు నెలలుగా డిమెన్షియోతో ఇబ్బంది పడుతున్నారు. మూత్రవిసర్జనపై ఆయనకు నియంత్రణ లేదు. సాధారణ నడక కన్నా చాలా నెమ్మదిగా నడుస్తున్నారు. ఏం తిన్నారో తర్వాత గుర్తు ఉండేది కాదు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఇబ్బంది పడేవారు. తమ పిల్లలకు ఫోన్ చేసినా చేయలేదని మళ్లీ చేసేవారు. పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. పలు ఆస్పత్రులలో చూపించినా ఫలితం లేకపోయింది. చివరికి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి టెస్టుల్లో మెదడులో నీరు చేరినట్లు నిర్ధారించినట్టు డాక్టర్ రమేష్ తెలిపారు.
మెదడులో నీరు చేరితే డిమెన్షియో :
చిన్నవయస్సులోనే చాలామందికి మెదడులో నీరు చేరితే వెంటనే కోమాలోకి వెళ్లిపోతారు. అదే పెద్ద వయసులో మెదడు కుచించుకుపోతుంది. దాంతో కొద్దిగా స్థలం ఏర్పడుతుంది. ఫలితంలో అందులో నీరు చేరుతుంది. నీరు చేరడం కారణంగా మెదడుపై ఒత్తిడి ఏర్పడి డిమెన్షియా వస్తుంది. ఈ తరహా డిమెన్షియాను కొద్దిపాటి శస్త్రచికిత్సతో సులభంగా నయం చేయొచ్చు. ఇదే పద్ధతిలో శంకర్రావుకు వరుసగా 3 రోజుల పాటు వెన్నెముకలో నుంచి నీరు తొలగించారు. మెదడులోని నీరు క్రమంగా తగ్గింది. ఆ వెంటంనే మెదడులో ఒక స్టెంట్ వేశారు. మెదడులో నీరు క్రమంగా పొట్టలోకి వచ్చి విసర్జన ద్వారా బయటకు వెళ్లిపోయేలా చేశామన్నారు.
మరో ఐదేళ్ల వరకు ఇబ్బంది ఉండదు :
నీరు తొలగించినప్పటి నుంచి శంకర్రావు ఆరోగ్య పరిస్థితి నార్మల్కు వచ్చేసింది. అందరిలానే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు అందరినీ చూడగానే గుర్తుపడుతున్నారు. నడక కూడా నార్మల్గానే ఉంది. ఏ సమస్యా లేదు. మరో ఐదేళ్ల వరకు ఏ ఇబ్బంది ఉండదు. అప్పుడప్పుడూ వైద్యులను సంప్రదించి సూచించిన మందులను వాడుతుండాలని డాక్టర్ రమేష్ తెలిపారు. అన్ని రకాల డిమెన్షియాలకూ ఈ చికిత్స విధానం పనిచేయదన్నారు. మెదడులో నీరు చేరడం ద్వారా వచ్చే డిమెన్షియాను మాత్రమే నయం చేయగలమని ఆయన చెప్పారు.
