Health: కొవిడ్ మహమ్మారి అనంతర కాలంలో ప్రమాదకరమైన స్ధాయిలో మత్తు పదార్థాల వినియోగం పెరగడం మరీ ముఖ్యంగా యువత, కౌమార దశలో ఉన్నవారిలో వీటి వినియోగం ఆందోళనకరంగా మారడంతో, నూతన ఆలోచనలను రేకెత్తించడానికి అంకితమైన స్వతంత్య్ర సంస్థ థింక్ ఛేంజ్ ఫోరమ్ జాతీయ స్ధాయిలో ఒక అధ్యయనం చేసింది. కౌమార దశలో పెరుగుతున్న వ్యసనాలు, వాటికి సూచనీయ పరిష్కారాలు నేపథ్యంలో దీనిని చేశారు. ఐడియాస్ ఫర్ యాన్ ఎడిక్షన్ ఫ్రీ ఇండియా శీర్షికన విడుదల చేసిన ఈ అధ్యయనంలో విధాన నిర్ణేతలు, సైకాలజీ, సోషల్ సైన్సెస్, వైద్య రంగం నుంచి నిపుణుల అభిప్రాయాలనూ తీసుకున్నారు.
ఈ నిపుణులో మెదాంత హాస్పిటల్స్లో హెడ్ నెక్ సర్జరీ కమ్ ఈఎన్టీ ఛైర్మన్ డాక్టర్ కే.కే హండా, సోషల్ ఇంపాక్ట్ కన్సల్టెంట్ లక్ష్మి భాస్కరన్, జెఎన్టీయులో ప్రొఫెసర్ అండ్ సెంటర్ ఫర్ సోషల్ మెడిసన్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఛైర్పర్సన్ ప్రొఫెసర్ రజిబ్ దాస్గుప్తా, క్లీనికల్ సైకాలజిస్ట్ ఆర్.కే సూరి, అడోలసెంట్ హెల్త్ ఎడ్యుకేటర్ డాక్టర్ సఫాలా షరాఫ్ తదితరులు ఉన్నారు.
భారతదేశంలో మత్తుపదార్థాల వినియోగానికి కారణమవుతున్న అతి కీలకాంశాలలో మత్తుపదార్ధాలను గ్లామరైజ్ చేయడం ఒకటి కాగా, రెండవది ఈ–సిగిరెట్ కంపెనీలు డీ ఎడిక్షన్కు తోడ్పడుతున్నాయని, ఇవి తక్కువ ప్రమాదం కలిగిస్తాయనే తప్పుడు ప్రచారం చేస్తూ మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. ఈ మత్తు పదార్థాల వినియోగ నివారణ కోసం తప్పుడు ప్రచారాలను అడ్డుకోవడం కీలకమని నిపుణులు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాల్సి ఉందన్న నిపుణులు.. ఈ తరహా వ్యసనాలకు వ్యతిరేకంగా తగినంతగా అవగాహన కూడా కల్పించాల్సి ఉందన్నారు.