ఆవేశంలో నేరం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సైతం పని చేసి డబ్బులు సంపాదించి వారి ఖర్చులతో పాటు, కుటుంబాలకు తోడుగా నిలిచేందుకు వీలు ఉంది. బయట చేసే పనిని బట్టి జీతాలు, కూలి ఇచ్చినట్టుగానే జైళ్లలోనూ స్కిల్డ్(నైపుణ్య కూలీలు), సెమీ స్కిల్డ్(కొద్దిగా నైపుణ్యం), అన్స్కిల్డ్ (సాధారణ కూలీలు) రకాలుగా జీతాలు చెల్లిస్తారు. కానీ మూడు నెలలుగా జైళ్లలో పనిచేస్తున్న ఖైదీలకు జీతాలు వారి ప్రిజనర్స్ పర్సనల్ క్యాష్( PPC) ఖాతాల్లో అధికారులు జమచేయడం లేదు.
దీంతో ముఖ్యంగా పేద ఖైదీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జైలు క్యాంటిన్లో ఉదయం ఇడ్లీ, దోశ, పూరి, బిస్కెట్లు, పేస్టులు, కొబ్బరినూనె, సబ్బులు, స్నాక్స్, బుధవారం చికెన్ బిర్యానీ, శుక్రవారం చికెన్ కర్రీ, ఆదివారం ఫ్రైడ్ రైస్ కొనుగోలు చేయలేకపోతున్నారని తెలిసింది. ఖైదీల ఖాతాలలో మూడు నెలలుగా వేతనాలు జమ కావడం లేదని జైలు వర్గాలు చెబుతున్నా వాస్తవంగా ఐదు నెలలుగా పడటం లేదని సమాచారం.
దాంతో త్వరలోనే జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి నెలలో బడ్జెట్ కేటాయింపు తో మూడు నెలల ఖైదీల వేతనాలు వారి ఖాతాలలో జమచేస్తాం. నిధుల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఖైదీల వేతనాల పెంపుపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖైదీల వేతనాలను పెంచుతాం.