గ్రూప్-2 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామకాలు చేపట్టవద్దని టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది.
గ్రూప్-2 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామకాలు చేపట్టవద్దని టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది. గతంలో గ్రూప్-2 కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ టీఎస్ పీఎస్ సీ వ్యవహరించిందని గ్రూప్-2 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు వైట్నర్, ట్యాంపరింగ్, స్క్రాచింగ్ చేసిన అభ్యర్థులను సెలక్ట్ చేయొద్దని పిటిషన్లో పేర్కొన్నారు.
దీంతో గ్రూప్-2 పరీక్షల్లో అందుకు సంబంధించిన జవాబులు తీసివేసి మిగిలిన వారికి ఇంటర్య్వూలలో 1:2 ప్రకారం నియామకాలు జరపాలని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు లెక్కచేయకుండా మళ్లీ అదే అభ్యర్థులను సెలక్ట్ చేసి ప్రొవిజనల్ లిస్ట్ను ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ ఫైనల్ లిస్టుకు సెలక్ట్ కాని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్ సీని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.