జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. సుభాషణ్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేశారు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గాను, లోకాయుక్త చైర్మన్ గానూ సుభాషణ్ రెడ్డి సేవలందించారు.
కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్ సుభాషణ్ రెడ్డి మే 1 కన్నుమూశారు. గడచిన నెల రోజులుగా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించి మృతి చెందారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఇద్దరు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. మరొక కుమారుడు ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
ఏఐజీ ఆస్పత్రి నుంచి సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్ లో ఉన్న ఆయన నివాసానికి తరలించగా, పలువురు ప్రముఖులు నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. నేటి సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.