హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) కొత్తగా ఆరు సెంట్రర్స్ ను ప్రారంభించనుంది. ఉస్మానియా యూనివర్శిటీకి రూసా ప్రాజెక్టు కింద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ 100 కోట్ల రూపాయిలను కేటాయించింది. ‘రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో నాణ్యమైన విద్యాను మెరుగుపర్చడానికి ఉద్దేశంతో రుసా ప్రాజెక్టు కింద నిధులను 10 రాష్ట్రాల వర్శిటీలకు కేటాయించిన క్రమంలో ఓయూ కూడా ఒకటిగా ఉంది.
పారిశ్రామిక ఔత్సాహికత- వినూత్న ఆవిష్కరణలు- ఉపాధి కేంద్రాన్ని ఉస్మానియా యూనివర్శిటీ ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 3వ తేదీ (జనవరి 3)సాయంత్రం మూడు గంటలకు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో మోడీ 3000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి హైదరాబాద్లో వర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, ప్రత్యేక ప్రధాద కార్యదర్శి నవీన్ మిట్టల్, రూసా ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ సౌందర్య జోసఫ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ టి కృష్ణారావు, నోడల్ అధికారులు ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ హాజరవుతారు. ఓయూ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ స్టడీస్, సెంటర్ ఫర్ మైక్రోబియల్ ఫెర్మెంటేషన్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ ప్రోటోటైపింగ్ అండ్ టెస్టింగ్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్, సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ లా, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రీసెర్చి సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ చెప్పారు. ఇది రాష్ట్రీయ ఉచాతర్ శిక్షా అభియాన్ (RUSA) మంజూరు చేసిన నిధులతో ఏర్పాటు కానుంది.