రంగంలోకి విద్యార్థులు : 10వ రోజుకి ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. కార్మికుల మద్దతుగా ప్రజాసంఘాలతో పాటు విద్యార్థిసంఘాలు ఉద్యమిస్తున్నాయి. సోమవారం(అక్టోబర్ 14,2019) ఓయూ స్టూడెంట్స్‌

  • Publish Date - October 14, 2019 / 02:57 AM IST

ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. కార్మికుల మద్దతుగా ప్రజాసంఘాలతో పాటు విద్యార్థిసంఘాలు ఉద్యమిస్తున్నాయి. సోమవారం(అక్టోబర్ 14,2019) ఓయూ స్టూడెంట్స్‌

ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. కార్మికుల మద్దతుగా ప్రజాసంఘాలతో పాటు విద్యార్థిసంఘాలు ఉద్యమిస్తున్నాయి. సోమవారం(అక్టోబర్ 14,2019) ఓయూ స్టూడెంట్స్‌ జేఏసీ మంత్రుల కార్యాలయాలను ముట్టడించనుంది. అటు ఇందిరాపార్క్‌లో ట్రేడ్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 10రోజుకి చేరింది. కార్మికుల పోరాటంలో విపక్షాలు భాగస్వామ్యమవుతున్నాయి. తాజాగా విద్యార్థి సంఘాలు కూడా ప్రత్యక్షపోరాటానికి దిగుతున్నాయి. ఓయూ విద్యార్థి జేఏసీ మంత్రుల కార్యాలయాలను ముట్టడించనుంది. మరోవైపు ఇందిరాపార్క్‌లో ట్రేడ్‌ యూనియన్స్‌ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతికి సంతాపంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. అన్ని డిపోల ముందు కార్మికులు శ్రీనివాస్‌రెడ్డికి నివాళులర్పించనున్నారు. కార్మికులెవరూ ప్రాణాలు తీసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు.
 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ఆర్టీసీ సమ్మె పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు. విపక్షాల వలలో యూనియన్లు పడ్డాయన్నారు ఎర్రబెల్లి. ఆర్టీసీని బాగు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 

ఆర్టీసీ కార్మికులు తమను కలిస్తే ఉద్యోగ సంఘాల వైఖరి చెప్తామన్నారు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి. ప్రభుత్వంపై ఉన్న అక్కసును వెళ్లగక్కేందుకు ఆర్టీసీ కార్మికుల సమ్మెను విపక్ష నేతలు వాడుకుంటున్నారన్నారు. ఆర్టీసీ నేతలు సొంతంగానే ముందుకెళ్లాలని.. రాజకీయ పక్షాల చేతిలో పడితే నష్టం జరుగుతుందని సూచించారు. ఉద్యోగుల మధ్య ప్రతిపక్షాలు చిచ్చు పెడుతున్నాయని దుయ్యబట్టారు. 

టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు బీజేపీ చీఫ్ లక్ష్మణ్‌. దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మె చేస్తుంటే రాజకీయ పార్టీల ప్రోద్బలంతో సమ్మె చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు అనడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగులకు, కార్మికులకు ఎవరికి సమస్యలొచ్చినా రాజకీయ పార్టీగా తాము స్పందిస్తామన్నారు.

అక్టోబర్ 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ.. రోజుకో తరహా నిరసనతో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వ్యూహాలు పన్నుతుంటే.. అధికారులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్‌లైన్ మాత్రం ముగుస్తోంది. 3 రోజుల్లోగా వందశాతం బస్సులు తిరగాల్సిందేనంటూ సీఎం స్పష్టం చేయడంతో.. అన్ని డిపోల్లోనూ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్‌ను నియమించుకునే పనిలో పడ్డారు మేనేజర్లు.