Punjab Chief Minister
Punjab Chief Minister: పంజాబ్ రాజధాని చండీగఢ్ లోని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసానికి సమీపంలో బాంబు కనపడడం కలకలం రేపింది. అనుమానాస్పద వస్తువు కనపడడంతో వెంటనే అక్కడకు చేరుకున్న బాంబును నిర్వీర్యం చేసే బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పంజాబ్, హరియాణా సీఎంల ఇళ్లకు దగ్గరలో హెలిప్యాడ్ ఉంటుంది.
ఆ ప్రాంతం వద్దే భద్రతా సిబ్బంది బాంబు గుర్తించినట్లు తెలుస్తోంది. భారత ఆర్మీ పశ్చిమ కమాండ్ కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు కనపడిన సమయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన నివాసంలో లేరని అధికారులు తెలిపారు.
‘‘అనుమానాస్పద వస్తువు ఉందని సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు వెళ్లి తనిఖీ చేశాం. బాంబ్ షెల్ ఉన్నట్లు గుర్తించాం. ఈ ఘటనపై విచారణ ప్రారంభించాం. అక్కడికి ఆ బాంబు ఎలా చేరిందన్న విషయంపై ఆరా తీస్తున్నాం. బాంబ్ స్వాడ్ ఆ ప్రాంతంలోని వేరే చోట్ల కూడా తనిఖీలు చేస్తున్నారు. ఆర్మీ కూడా వచ్చి దీనిపై దర్యాప్తు చేయనుంది’’ అని చండీగఢ్ పరిపాలనా విభాగ నోడల్ అధికారి కుల్దీప్ కోహ్లీ మీడియాకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు, మరో ఘటనలో పంజాబ్ లోని గుర్దాస్ పుర్ సెక్టార్ లో అంతర్జాతీయ సరిహద్దులకు 2 కిలోమీటర్ల దూరంలో సరిహద్దు భద్రతా దళం పాకిస్థాన్ కు చెందిన ఓ పాత డ్రోనును స్వాధీనం చేసుసుకుంది. అందులో ఒక కిలో హెరాయిన్ ఉన్నట్లు గుర్తించింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ డ్రోను పూర్తిగా ధ్వంసమైన స్థితిలో కనపడింది.
Viral Video: 1,167 పోస్టులకు పరీక్ష.. స్టేడియం మొత్తం నిండిపోయిన అభ్యర్థులు