Pakistan power outage: గ్రిడ్ వైఫల్యం వల్ల పాకిస్థాన్ లోని పలు నగరాల్లో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాక్ పై విద్యుత్ కట్ రూపంలో మరో పిడుగు పడ్డట్లయింది. ఇవాళ ఉదయం నుంచి విద్యుత్తు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.
గ్రిడ్ వైఫల్యం నేపథ్యంలో ఆ వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుపుతున్నామని అధికారులు అంటున్నారు. పలు నగరాల్లో విద్యుత్తు నిలిచిపోయిందని పాక్ ప్రభుత్వం సహా పలు విద్యుత్తు సరఫరా సంస్థలు నిర్ధారించాయి. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలోని అనేక ప్రాంతాల్లో కొన్ని గంటలుగా విద్యుత్తు లేదు.
బలూచిస్థాన్ లోని 22 జిల్లాల్లో విద్యుత్తు నిలిపోయిందని అధికారులు చెప్పారు. ఇస్లామాబాద్ లోని 117 గ్రిడ్ స్టేషన్లకు విద్యుత్తు లేదని తెలిపారు. పెషావర్ లోనూ విద్యుత్తు అందట్లేదని అన్నారు. పాకిస్థాన్ ఈ నెలలో కొత్తగా విద్యుత్తు పరిరక్షణ ప్రణాళికను ప్రకటించింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, కొత్తగా అప్పులు దొరకకపోవడం, ధరల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, గత ఏడాది అక్టోబరులోనూ కరాచీ, లాహోర్ సహా పలు కీలక నగరాల్లో దాదాపు 12 గంటల పాటు విద్యుత్తు నిలిచిపోయింది.
Tamil Nadu : అరక్కోణం ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. క్రేన్ బోల్తా పడి నలుగురు మృతి