అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 24 మంది మృతి..

  • Publish Date - March 4, 2020 / 04:42 AM IST

అమెరికాలోని నాష్‌విల్లే..టెన్నెసీ సహా పరసర ప్రాంతాల్లో టోర్నడోలు, గాలివాన బీభత్సం సృష్టించాయి. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం (మార్చి 3,2020) తెల్లవారు జామున టోర్నడోలు సృష్టించిన బీభత్సానికి 24మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని టెన్నెసీ ఎమర్జెన్సీ ఏజెన్సీ ధ్రువీకరించింది. విద్యుత్ లైన్లు కూలి పడటంతో 24మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. టెన్నెసీ ప్రాంతంలోని పుట్నంకౌంటీలో 18మంది మరణించినట్లుగా అధికారులు తెలిపారు. 

పెనుగాలులతో కూడిన తుపాను బీభత్సానికి పలు ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఒక్క నాష్‌విల్లేలోనే 48 భవనాలు కుప్పకూలాయనీ… మరికొన్ని గృహాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని మేయర్ జాన్ కూపర్ పేర్కొన్నారు. గాయపడిన 150 మందిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. కాగా  తుపాను కారణంగా తమ ‘‘గుండెలు బద్దలయ్యాయని’’ టెన్నెసీ గవర్నర్ బిల్ లీ  తెలిపారు. ఈ విపత్తు నుంచి తేరుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

See Also | కౌంట్ డౌన్ : GSLV F – 10 ప్రయోగానికి ఏర్పాట్లు