Pakistan Embassy: పాకిస్తాన్ రాయబార కార్యాలయం ముందు బీజేపీ నిరసన
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడని నేను ఇండియాకు మరోసారి గుర్తు చేస్తున్నాను. కానీ గుజరాత్ కసాయి ఇంకా బతికే ఉన్నారు. ఆయన ఇండియాకు ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆయన ప్రధాని అయ్యే వరకు ఈ దేశంలోకి రాకుండా నిషేధం విధించారు. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి, అలాగే ఆర్ఎస్ఎస్ విదేశాంగ మంత్రి కూడా
- tony bekkal
- Published On : December 16, 2022 / 05:59 PM IST
BJP workers protest outside Pakistan Embassy
Pakistan Embassy: దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పాకిస్తాన్ మంత్రి బిలావర్ భుట్టో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ‘పాకిస్తాన్ డౌం డౌం’, ‘బిలావర్ భుట్టో క్షమాపణ చెప్పు’ అంటూ నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘గుజరాత్ కసాయి’ అంటూ భుట్టో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. శుక్రవారం పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాక్ రాయబార కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.
బీజేపీ కార్యకర్తలు నిరసనకు వస్తున్నారని తెలియగానే పాకిస్తాన్ రాయబార కార్యాలయం ముందు ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు వేసిన మొదటి స్థాయి బారికేడ్లను నిరసనకారులు చేధించుకుని ముందుకు వచ్చారు. రాయబార కార్యాలయాన్ని ముట్టడించడానికి వస్తున్న నిరసనకారులను రెండవ బారీకేడ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిరసన నేపథ్యంలో పోలీసులు వాటర్ కెనాన్లను ఏర్పాటు చేశారు. కొంత మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనికి ముందు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడని నేను ఇండియాకు మరోసారి గుర్తు చేస్తున్నాను. కానీ గుజరాత్ కసాయి ఇంకా బతికే ఉన్నారు. ఆయన ఇండియాకు ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆయన ప్రధాని అయ్యే వరకు ఈ దేశంలోకి రాకుండా నిషేధం విధించారు. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి, అలాగే ఆర్ఎస్ఎస్ విదేశాంగ మంత్రి కూడా. అసలు ఆర్ఎస్ఎస్ ఏంటి? అది హిట్లర్ నుంచి ప్రేరణ పొందింది. హిట్లర్ స్వస్తిక్ నుంచి ప్రేరణ పొందింది’’ అని అన్నారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయంలో తాజాగా మాట్లాడుతూ ‘‘ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో చనిపోయాడు’’ అని అన్నారు. అనంతరం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో పై విధంగా స్పందించారు.
