Pakistan Train Accident: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆ దేశంలోని కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో ఆ రైలులోని పది బోగీలు బోల్తా కొట్టాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందగా, 80 మందికి పైగా గాయపడ్డట్లు పాకిస్తాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పాకిస్తాన్ జియో న్యూస్ వెల్లడించిన వివరాకల ప్రకారం.. షాజాద్పూర్-నవాబ్షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్ప్రెస్లోని ఎనిమిది కోచ్లు పట్టాలు తప్పినట్లు చెబుతున్నారు. ఈ రైలు ప్రమాదం అనంతరం సింధ్ ప్రాంతంలోని వివిధ జిల్లాలకు రైళ్ల రాకపోకలు నిలివేశారు. అదే సమయంలో, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నవాబ్షాలోని పీపుల్స్ మెడికల్ హాస్పిటల్కు తరలించారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
రైలు ప్రమాదంలో 10 కోచ్లు పట్టాలు తప్పినట్లు రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్ రెహమాన్ ధృవీకరించారు. మరింత సమాచారం రాబడుతున్నట్లు తెలిపారు. అదే సమయంలో, ప్రభావిత బోగీల నుండి ప్రయాణికులను తరలించడానికి బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. స్థానిక యంత్రాంగం ప్రకారం, ప్రమాదం తర్వాత సమీపంలోని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని విధించారు.