కేరళలో సుప్రసిద్ధ శబరిమల పుణ్యక్షేత్రంపైనా కరోనా ప్రభావం పడింది. భక్తులు అయ్యప్ప దర్శనానికి రావొద్దని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది.
కేరళలో సుప్రసిద్ధ శబరిమల పుణ్యక్షేత్రంపైనా కరోనా ప్రభావం పడింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులు అయ్యప్ప దర్శనానికి రావొద్దని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. నెల వారీ పూజల కోసం శుక్రవారం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మార్చి 18న మళ్లీ మూసివేస్తారు. టీబీడీ అధ్యక్షుడు వాసు మంగళవారం (మార్చి 10, 2020) మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో శబరిమల దర్శనానికి రావొద్దని భక్తులకు సూచించారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కేరళలో మరో 8 కరోనా కేసులు
కేరళలో తాజాగా మరో 8 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 14కు చేరింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, థియేటర్లను ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశించింది. మరోవైపు, కర్ణాటక, పుణేలో ముగ్గురికి చొప్పున వైరస్ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 61కి పెరిగింది. బెంగళూరులో ప్రాథమిక పాఠశాలలకు నిరవధిక సెలవులు ప్రకటించారు. (కరోనాపై యుద్ధం గెలిచిన తెలంగాణ ప్రభుత్వం)
కరోనా బాధితులకు తొలిసారి యాంటీ హెచ్ఐవీ మందులు
ఇద్దరు కరోనా బాధితులకు చికిత్స కోసం దేశంలో తొలిసారి రెండు యాంటీ హెచ్ఐవీ మందులను వినియోగించారు. కాగా, ఇరాన్లో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను వాయుసేన విమానం ద్వారా మంగళవారం స్వదేశానికి తీసుకొచ్చారు. ఘజియాబాద్లోని ప్రత్యేక కేంద్రంలో వారిని ఉంచారు. ఇరాన్లో ఇప్పటివరకు 291 మంది మరణించగా, 8,042 మంది వైరస్ బారినపడ్డారు.
ఇటలీ దిగ్బంధం
వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడిచేసేందుకు ఇటలీ ప్రభుత్వం దేశం మొత్తాన్ని దిగ్బంధంలో ఉంచింది. మొత్తం 6 కోట్లమంది ప్రజలు ఇంటికే పరిమితం కావాలని సూచించింది. ఏప్రిల్ 3 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాటికన్లోని ప్రసిద్ధ సెయింట్ పీటర్స్ స్వేర్, బసిలికాను ఏప్రిల్ 3 వరకు మూసివేయనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మంగళవారం తొలిసారి వుహాన్లో పర్యటించారు.
చైనాలో ఇప్పటివరకు 3.136 మంది మృతి
చైనాలో ఇప్పటివరకు 3.136 మంది మరణించగా, 80,754 మందికి వైరస్ సోకింది. పాకిస్థాన్లో కరోనా కేసుల సంఖ్య 18కి పెరిగింది. కరోనా నేపథ్యంలో రెండువారాలపాటు ఇటలీకి విమాన రాకపోకలను రద్దు చేస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనాకు సంబంధించి ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదని శ్వేతసౌధం ప్రకటించింది.
అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఈశాన్య రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేస్తున్నాయి. మిజోరం సోమవారమే మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేసింది. విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధించింది. తాజాగా మణిపూర్ కూడా మయన్మార్తో సరిహద్దులను మూసివేసింది. ఇటీవలే సిక్కిం, అరుణాచల్ కూడా విదేశీయుల పర్యటనలపై ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే.
See Also | అమెజాన్ బంపర్ ఆఫర్.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులకు వార్షిక వేతనం 27 లక్షలు!