జోర్డాన్ స్పాన్కు అదొక ఎమోషనల్ మూమెంట్. యాక్సిడెంట్లో చనిపోయిన అతని కొడుకు గుండె చప్పుడు వేరొకరిలో విని కన్నీరు పెట్టుకున్నాడు. టెక్సాస్లోని బ్రెన్హామ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాథ్యూ స్పాన్ ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికే అతను అవయవదానానికి సంతకం చేసి ఉండడంతో ఐదుగురికి అతని అవయవాలను అమర్చారు.
గుండెనొప్పితో బాధపడుతున్న క్రిస్టి రిచర్డ్ రస్ అనే మహిళకు అతని గుండె సరిపోతుందని డాక్టర్లు అమర్చారు. సర్జరీ జరిగిన రెండేళ్ల తర్వాత జోర్డాన్.. అతని భార్య ఆ మహిళను కలిశారు. ఆమె ఛాతీ నుంచి హార్ట్ బీట్ వింటూ తన కొడుకు ఇంకా బతికే ఉన్నాడని గుండె చప్పుడులో సజీవంగానే ఉన్నాడంటూ ఎమోషనల్ అయ్యాడు.
‘జోర్డాన్ నేనూ కలిసి ఓ ప్రత్యేకమైన మహిళను కలిశాం. మాథ్యూ స్పాన్ అవయవదానం చేశాడని ఎంత మందికి తెలుసో నాకు తెలియదు. కానీ, 7అవయవాలను డొనేట్ చేసి అయిదుగురి ప్రాణాలు కాపాడాడు’ అంటూ కుటుంబ సభ్యుల్లో ఒకరు అన్నారు.
ఆ ఒక్క నిమిషం పాటు ఉన్న వీడియోను సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు. గుండె చప్పుడు వింటూ ఎమోషనల్ అయిన తండ్రి నెటిజన్ల మనసు దోచుకుంటున్నాడు. ‘మీకు తెలుసా నా కొడుకు గుండె చప్పుడ్ని పది రోజుల పాటు వింటూనే ఉన్నా. చావు బతుకుల మధ్య పోరాడుతున్న సమయంలో హాస్పిటల్ మానిటర్పై చూస్తూ ఉండేవాణ్ని’ అంటూ చెప్పుకొచ్చాడు.
‘మరొకరికి ప్రాణదానం చేయడమనేది ఉన్నతమైన విషయం. ఇప్పటికే మీరు ఆర్గాన్ డొనార్ కాకపోయుంటే వెంటనే రిజిష్టర్ చేయించుకుని వేరొకరికి ప్రాణదానం చేసిన వాళ్లవుతారని’ గుండెను దానంగా పొందిన మహిళ తెలిపారు.