నేపాల్ పార్లమెంట్ రద్దు అయింది. సొంత పార్టీలోనే ఏర్పడిన ఇబ్బందితో ఉక్కిరి బిక్కిరి అయిన నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం ఏకంగా పార్లమెంట్నే రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఉదయం సమయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పార్లమెంట్ రద్దు చేయాలంటూ ప్రెసిడెంట్కు సిఫారసు చేసినట్లు ఇందన శాఖ మంత్రి బర్షమాన్ పున్ వెల్లడించారు.
వివాదాస్పద ఆర్డినెన్స్ రద్దు చేయాలంటూ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలోని ప్రధాని ఓలి విరోధులు.. చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సొంత పార్టీతో పాటు మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వం వహిస్తున్న వ్యతిరేక వర్గం నుంచి కొన్ని ఆర్డినెన్సులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సొంత పార్టీ నేతలను బుజ్జగించడానికి ఓలి విశ్వప్రయత్నాలే చేశారు. శనివారం సాయంత్రం దేశాధ్యక్షులు బిద్యాదేవి భండారీని కూడా కలిశారు. చివరికి ఆర్డినెన్స్ విషయంలో పార్టీ చీలికకు దారితీసింది. చీలికను అడ్డుకోవడానికి ప్రధాని ఓలి ఇటువంటి సడెన్ నిర్ణయం తీసుకుని పార్లమెంట్ను రద్దును ప్రకటించారు. దాంతో పాటుగా మధ్యంతర ప్రభుత్వానికి ఆయనే నేతృత్వం వహించనున్నారు.
అసలు విషయమేమిటంటే..:
కీలకమైన అపాయింట్మెంట్లు ఇవ్వడానికి కంప్లీట్ అధికారం స్వయంగా కట్టబెట్టుకుంటూ మంగళవారం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అది కాస్తా వివాదస్పదమైంది. బుధవారం పార్టీ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని పీఎం ఓలిని డిమాండ్ చేశారు. ఆరంభంలో పార్టీ ప్రెజర్కు ఫీల్ అయినా.. తర్వాత మనసు మార్చుకున్నారు. శనివారం ప్రధాని ఓలి స్వయంగా సమస్య పరిష్కారం కోసం యత్నించారు. అయినప్పటికీ సమస్య సాల్వ్ కాలేదు.