Strait Of Hormuz : అమెరికా సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్..! హర్ముజ్లో ఆల్ క్లియర్.. ఇరాన్కు దిమ్మతిరిగే షాక్..
Strait of Hormuz : హర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఆటంకం కలిగిస్తోన్న సీమైన్స్ను పూర్తిగా తొలగించేందుకు అమెరికా ఆపరేషన్ చేపట్టి సక్సెస్ అయింది.
- Harish Thanniru
- Published on- August 28, 2026 / 02:10 PM IST
Strait Of Hormuz : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వివాదం నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా బంద్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.. తమ ఆదేశాలను ధిక్కరించి హర్ముజ్ దాటే ప్రయత్నం చేస్తే మందుపాతరలను (సీ మైన్స్) ఏర్పాటు చేశామని.. నౌకలు పేలిపోతాయని హెచ్చరించింది.
హర్ముజ్పై పట్టు సాధించే క్రమంలో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో సీ మైన్స్ను ఏర్పాటు చేసింది. వీటి కారణంగా అమెరికా బలగాల కదలికలు నిలిచిపోవడంతో పాటు వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర ముప్పు ఏర్పడింది. అయితే, హర్ముజ్ జలసంధి తమ ఆధీనంలో ఉందని అమెరికా చెబుతున్నప్పటికీ.. ఆ మార్గంలో వెళ్లిన పలు నౌకలు వాటిని ఢీకొని పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా కీలక ఆపరేషన్ నిర్వహించింది.
హర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఆటంకం కలిగిస్తోన్న ఆ సీమైన్స్ను పూర్తిగా తొలగించేందుకు అమెరికా ఆపరేషన్ చేపట్టి సక్సెస్ అయింది. తాజాగా.. యూఎస్ సెంట్రల్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఈ విషయంపై సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన మైన్స్ను పూర్తిగా తొలగించడం అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’ అని పేర్కొన్నారు.
అమెరికా నౌకాదళానికి చెందిన డైవర్స్తో పాటు ఇతర సైనిక విభాగాలు సమన్వయంతో మైన్ల తొలగింపు ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. మైన్ల తొలగింపుతోపాటు కొన్నిగత కొన్ని నెలలుగా సుమారు 1,500 వాణిజ్య నౌకలు ఈ జలసంధిని దాటేందుకు తమ దళాలు సహకరించినట్లు అమెరికా చెబుతోంది.
