పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షల కోసం ఎదురుచూస్తున్న తరుణమిది. పదో తరగతి పరీక్షలపై హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని రకాల జాగ్రత్తలతో జూన్ 8 నుంచి పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు. ప్రధాన పరీక్షలు జూన్ 29తో ముగియనున్నాయి.
ఓరియంటల్, వొకేషనల్ పరీక్షలు జూలై 5తో ముగియనున్నాయి. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా పరీక్షల షెడ్యూల్ను ఖరారు చేశారు. భౌతిక దూరం పాటించేలా పరీక్ష కేంద్రాలను పెంచేశారు. పాత కేంద్రాలకు కొత్త కేంద్రాలను అర కిలో మీటర్ దూరం ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. ఓరియంటల్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. వొకేషనల్ థియరీ పరీక్ష మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగుతుంది.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం ఉండేలా పరీక్ష కేంద్రాలను పెంచినట్టు తెలిపారు. ప్రస్తుతం 2,580 పరీక్షాకేంద్రాలు ఉన్నాయని, అదనంగా 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్ చేయడంతోపాటు విద్యార్థులకు మాస్కులను అందిస్తామన్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. ప్రతి బెంచిపై ఒకరే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తామని తెలిపారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను నడిపిస్తామని చెప్పారు. పరీక్షలకు సంబంధించి హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులెవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని ప్రత్యేక గదుల్లో పరీక్ష రాయిస్తామని తెలిపారు. ఎవరైనా ఇన్విజిలేటర్లకు దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని విధుల నుంచి తప్పించి రిజర్వులో ఉన్న వారిని నియమిస్తామన్నారు. సిబ్బంది మాస్కులు ధరించడంతోపాటు చేతులకు గ్లౌజ్లు ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.