Memory Loss : జ్ఞాపకశక్తి తగ్గటానికి ఆహారాలు, అలవాట్లే కారణమా?..
మిఠాయిలు తినడానికి ఇష్టపడే వారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చక్కెర ఎక్కువగా తినడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుంది.
- Guntupalli Ramakrishna
- Published On : November 19, 2021 / 10:18 AM IST
Memory Loss
Memory Loss : జ్ఞాపకశక్తి మనిషిలో చాలా కీలకమైనది. ఇది వయస్సుకు సంబంధించినదని అంతా అనుకుంటారు. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుందని అంటారు. మన చుట్టూ ఉన్న కొంతమంది పెద్దవారిని మీరు చూసే ఉంటారు. వారి వయస్సు పెరిగినా వారి జ్ఞాపకశక్తి మాత్రం ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే వారు తీసుకునే ఫుడ్, జీవన శైలివల్ల వారు అలా ఉంటారు. ఇంట్లో ఏ వస్తువును ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం. కొన్ని సార్లు క్షణాల్లోనే ఎక్కడా పెట్టామనేది గుర్తుండదు.
ఇక విద్యార్థులు ఎంత చదివినా మళ్లీ మళ్లీ చదువుతూనే ఉంటారు. తీరా పరీక్ష సమయానికి కొన్ని ముఖ్యమైన సమాధానాలను మర్చిపోయి.. బాధపడుతుంటారు. ఈ సమస్య వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపిస్తుంటుంది. ఆహారం మన శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే మతిమరుపుకు కారణమయ్యే ఆహారాలకు, అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిపై ఒత్తిడిని కలిగిస్తుంది. అల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. సరైన నిద్ర లేకపోవడం, హర్మోన్ల లోపం కూడా దీనికి కారణం కావచ్చు. చాలా మంది అయిల్ లో వేయించి పదార్ధాలను అతిగా తింటుంటారు. ఎక్కువ వేయించిన ఆహారం రుచికరంగా అనిపిస్తుంది కానీ ఇది ఏ విధంగానూ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ వేయించిన ఆహారం మీ నరాలను దెబ్బతీస్తుంది. మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు తేలికైన, జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకుంటే మంచిది.
ఆల్కహాల్ తాగే అలవాటు మీ మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది మీ శరీరంలోని అన్ని ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీన్ని తాగడం వల్ల మనిషి మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది సాధారణ విషయాలను కూడా మరిచిపోతారు. జంక్ ఫుడ్లో రుచిని పెంచడానికి డోపమైన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే కొన్ని వస్తువులను ఉపయోగిస్తారు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల వ్యక్తిలో ఒత్తిడి స్థాయి పెరిగి జ్ఞాపకశక్తి బలహీనపడటం మొదలవుతుంది.
మిఠాయిలు తినడానికి ఇష్టపడే వారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చక్కెర ఎక్కువగా తినడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా వ్యక్తి జ్ఞాపకశక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. వీటితోపాటు జ్ఞాపకశక్తి తగ్గటానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వయస్సు పెరగటం అనేది సాధారణమైన కారణం కాగా, అల్జీమర్స్ వ్యాధి, స్ట్రోక్, మెదడులో కణితులు, కుంగుబాటు, తలకు గాయాలు కావటం, యాంజీ యాంజైటీ మందులు, యాంటీ డిప్రస్సంట్స్, యాంటి సిజ్యూర్ మందులు, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు కూడా ఇందుకు కారణం కావచ్చు.
