Whole Grain Diet : చిరుధాన్యపు ఆహారంతో బరువు తగ్గొచ్చు తెలుసా?..
సజ్జలు తక్కువ క్యాలరీలను ఇస్తాయి. ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు సజ్జలను తప్పకుండా మెనూలో చేర్చుకోవాలి.
- Guntupalli Ramakrishna
- Published On : December 14, 2021 / 01:12 PM IST
Whole Grains
Whole Grain Diet : అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి.. ఎప్పటికప్పుడు బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. మన బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన ఎత్తుకు తగ్గట్టుగా ఎంత బరువు ఉండాలో తెలుసుకుని ఆ విధంగానే బరువు మేనేజ్ చేయాలి. అయితే, అలా బరువు మెయింటెయిన్ చేయాలంటే మన జీవన, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఈ రోజుల్లో అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నావారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. పని ఒత్తిడి కారణంగానో, లేదా మరే ఇతర కారణాల వల్ల ఊబకాయుల సంఖ్య పెరిగిపోతుంది. బరువు తగ్గడానికి ఎన్నో కసరత్తులు చేస్తున్నారు. అయినప్పటికీ బరువులో ఏమాత్రం మార్పు రావటం లేదు. బరువు పెరగడానికి గల కారణాల్లో ముఖ్యమైనవి వేళకు మంచి ఆహారం తీసుకోకపోవడం, జంక్ ఫుడ్, ఫస్ట్ ఫుడ్ వంటికి కూడా ఒక కారణం. అలాంటి ఆహారం కంటే పొట్టుతీయని ధాన్యాలను తీసుకోవటం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని న్యూట్రిషియన్ నిపుణులు సూచిస్తున్నారు.
రాగులలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. హీమోగ్లోబిన్ తయారీకి అవసరమైన ఐరన్ రాగుల ద్వారా శరీరానికి అందుతుంది. అంతేకాకుండా వీటిలో కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్నఫీలింగ్ ఉంటుంది. డయాబెటిస్తో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. రాగులు పిల్లలకు పెడితే చాలా మంచిది. ఇందులో ఉన్న అమైనోయాసిడ్స్ పిల్లల మెదడు పెరుగుదలకు సహాయపడతాయి.
జొన్నల్లో విటమిన్ బి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్లు, ఫెనొలిక్ యాసిడ్స్, టానిన్స్ ఉంటాయి. బి విటమిన్ జీవక్రియల రేటును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మెగ్నీషియం ఎముకలు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. 96గ్రాముల జొన్నలు తీసుకుంటే రోజూ తీసుకోవాల్సిన ఫైబర్లో 20 శాతం శరీరానికి అందుతుంది. ఫైబర్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
సజ్జలు తక్కువ క్యాలరీలను ఇస్తాయి. ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు సజ్జలను తప్పకుండా మెనూలో చేర్చుకోవాలి. వీటిలో ఉన్న ఫైబర్ ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉంచుతుంది. ఫలితంగా రోజూ తీసుకునే క్యాలరీల సంఖ్య పెరగదు. సజ్జలు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ను నియంత్రించడంతో పాటు కొన్ని రకాల కేన్సర్లు రాకుండా కాపాడుతాయి.
కొర్ర బియ్యం తినటం వల్ల రక్తహీనత, మలబద్ధకం, జీర్ణకోశ వ్యాధుల నివారణ, ఊబకాయం, థైరాయిడ్, కంటి సమస్యలకు చక్కటి ఆహారం. అండుకొర్రలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. పీచు పదార్థాలు అధికంగా ఉండడం వల్ల కేన్సర్ లాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడుతోంది. రక్తంలో చెడు క్రొవ్వును బయ టకు పంపించేస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది.
సామలు ఆహారంగా తీసుకోవటం వల్ల పైత్యం ఎక్కువ అవడం వల్ల వచ్చే సమస్యలను నిరోధిస్తుంది. భోజనం తరువాత గుండెల్లో మంట, పుల్లత్రేన్పులు రావడం, పైత్యరసం గొంతులో వచ్చినట్టు ఉండటం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. వీర్యకణ సమస్యలు,ఆడవాళ్ళ రుతు సమస్యలు,సంతానలేమి నివారణ, మైగ్రైన్, గుండె, ఆర్థరైటిస్ మొదలైన సమస్యలకు మందు.
ఊదలు ఆహారంగా తీసుకోవటం వల్ల గర్భిణులు,బాలింతలకు ఊదలు మంచి బలవర్థకమైన ఆహారం. శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది.. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్ధకానికి, మధుమేహానికి, జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేవుల్లో వచ్చే పుండ్లు,కేన్సర్ లాంటి సమస్యల బారిన పడకుండా కాపాడుతాయి. కాలేయ సమస్యలకు, కీడ్ని పనితీరును మెరుగు పరుస్తోంది.శారీరక శ్రమ లేకుండా.. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవాళ్ళకు ఊదలు చాలా మంచి ఆహారం.
