Bananas : మన దేశంలో అరటిపండును పేదవాడి ఆపిల్ గా పిలుస్తారు. ఇది మంచి పోషక విలువలు కలిగి ఉంటుంది. ఏడాది పొడవునా పుష్కలంగా లభించే అరటి పండ్లలోని పోషకపదార్ధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. త్వరగా జీర్ణమై పోయి శరీరానికి శక్తినిస్తాయి. ఎదుగుతున్న పిల్లలకు సంపూర్ణ ఆహారంగా అరటి దోహదపడుతుంది. అరటిపండులో 75 శాతం నీరు గుజ్జు రూపంలో ఉంటుంది. పండే కొద్దీ గుజ్జు మరింత మెత్తగా ఉంటుంది.
అరటిలోని కార్భోహైడ్రేట్స్ శరీరానికి శక్తిని ఇస్తాయి. పెద్దపేగు వ్యాధి గ్రస్తులకు చాలా చక్కని ఆహారం. పీచు పదార్ధం, మెగ్నీషియమ్ పుష్కలంగా ఉన్నందున మలబద్దకాన్ని పోగొడుతుంది. రాత్రిపూట అరటిపండు తింటే నిద్రబాగా పడుతుంది. ఇందులోని పొటాషియం కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్న వారు ఒక పూట భోజనం , లేదా టిఫిన్ మానేసి మూడు అరటి పండ్లు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. జబ్బుపడిన వారు అరటి పళ్లు తింటే త్వరగా కోలుకుంటారు.
అరటి పండ్లోని సహజసిద్ధమైన చక్కెరలు రక్తప్రసరణలోకి విడదల కావటం వల్ల త్వరగా శక్తి సమకూరుతుంది. మానసిక స్ధితిని మెరుగ్గా ఉంచే కార్పోహైడ్రేట్ లను అరటిపండు కలిగి ఉంటుంది. అరటిని తినటం ద్వారా మెదడు, రక్త సంబంధిత రోగాలను 20శాతం వరకు నివారించవచ్చని పరిశోధకులు తేల్చారు. రోజుకు మూడు అరటి పండ్లు తీసుకోవటం ద్వారా గుండెపోటు, రక్తపోటు, వంటి వాటిని దరిచేరకుండా చూసుకోచ్చని పరిశోధకలు సూచిస్తున్నారు. రోజుకు మూడు అరటి పండ్లు తీసుకోవటం ద్వారా శరీరంలో పొటాషియం శాతాన్ని తగ్గించి గుండెపోటు ను నియంత్రించవచ్చని పరిశోధనల్లో తేలింది.