Panakam Vadapappu : శ్రీరామనవమి పానకం, వడప్పప్పులో ఔషధగుణాల గురించి తెలిస్తే?
పానకంలో వేసే వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. పానకంలో వేసే మిరియాల్లో ఔషదగుణాలు ఉంటాయి. కఫాన్ని తగ్గించి జలుబు రాకుండా చేస్తాయి.
- Guntupalli Ramakrishna
- Published On : April 5, 2022 / 11:37 AM IST
Panakam, Vadapappu
Panakam Vadapappu : తెలుగు కొత్త సంవత్సరంలో జరుపుకొనే ఉగాది పండుగ తరవాత వచ్చే శ్రీరామనవమి పండుగను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ శ్రీరామ నవమి వేడుకలకు రామాలయాలన్ని సుందరంగా ముస్తాభవుతాయి. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. శ్రీరామ నవమి వేడుకలుచైత్రమాసంలో జరగటం వల్ల వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. పండుగరోజు శ్రీరాముడిని పూజించిన తరువాత మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. ఈ ప్రసాదాల వెనుక అనేక ఔషదగుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పెసరపప్పు పానకం సేవించడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదేవిధంగా వడపప్పు పానకం మన శరీరానికి చలువ చేస్తాయి. వేసవిలో తరచూ పానకాన్ని తాగితే వడదెబ్బ తగలదు. శరీరం వేడిని తగ్గించొచ్చు. కనుకనే వడపప్పు, పానకం ప్రసాదానికి అంత ప్రాధాన్యత ఉంది. పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి పరుస్తుంది, చర్మానికి కాంతినిస్తుంది. వడపప్పుగా పిలవబడే పెసరపప్పు వడదెబ్బ నుండి కాపాడుతుంది. ఇందులో అనేక పోషకాలు ఉండటం వల్ల బుద్ధి వికసిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతాయి. పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. పెసర్లలో ఐరన్ పుష్కలం. రక్తహీనతను తగ్గించడానికి తోడ్పడతాయి. వడపప్పులో వాడే కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కొబ్బరి తినేవారిలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది.
పానకంలో వేసే వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. పానకంలో వేసే మిరియాల్లో ఔషదగుణాలు ఉంటాయి. కఫాన్ని తగ్గించి జలుబు రాకుండా చేస్తాయి. దాహాన్ని తగ్గించే గుణం వీటికి ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఎండ తీవ్ర నుండి కాపాడతాయి. మిరియాల్లో ఉండే చవిసిన్ అనే పదార్ధం అజీర్తి సమస్య నుండి కాపాడుతుంది. లాలా జలం ఊరేలా చేస్తుంది. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణ మౌతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారి బాధలకు బెల్లం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వల్ల అవి ఒంట్లోని ఫ్రీరాడికల్స్ను హరిస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లంలో పీచు ఎక్కువ. అందుకే ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. బెల్లం జీర్ణ వ్యవస్థ మీద, పేగుల మీద భారాన్ని తొలగిస్తుంది.
వడపప్పు తయారీ :
వడపప్పు తయారీ కోసం ముందుగా పెసర పప్పు ఒక కప్పు, కొబ్బరి తురుము2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు2 టీ స్పూన్లు, క్యారట్ తురుము ఒక టేబుల్ స్పూను, పచ్చి మిర్చి తరుగు 2 టీ స్పూన్లు, నిమ్మరసం2 టీ స్పూన్లు, ఉప్పుకొద్దిగా తీసుకోవాలి. ముందుగా పెసరపప్పును సుమారు మూడు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరరగు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు అర గంట తరవాత తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
పానకం తయారీ ;
పానకం తయారీ కోసం ముందుగా నీళ్లు4 కప్పులు, బెల్లం పొడి రెండు కప్పులు, ఏలకుల పొడి టీ స్పూను, మిరాయల పొడి రెండు టీ స్పూన్లు తీసుకోవాలి. ముందుగా ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు బాగా కలపాలి. ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి మరోమారు కలపాలి. దీంతో రుచికరమైన పానకం సిద్దమైపోతుంది.
