Shigella Infection : కేరళలో మళ్లీ షిగెల్లా విజృంభణ.. లక్షణాలు ఇవే!
Shigella Infection : కరోనా మహమ్మారికి తోడు మరో వ్యాధి వణికిస్తోంది. కేరళలో మళ్లీ షిగెల్లా (Shigella) బ్యాక్టీరియా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని కోజికోడ్లో షిగెల్లా కొత్త కేసు నమోదైంది.
- Sreehari A
- Published On : April 29, 2022 / 09:21 AM IST
Kerala's Kozhikode Reports Shigella Infection Again, Health Dept Starts Preventive Measures (1)
Shigella Infection : కరోనా మహమ్మారికి తోడు మరో వ్యాధి వణికిస్తోంది. కేరళలో మళ్లీ షిగెల్లా (Shigella) బ్యాక్టీరియా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని కోజికోడ్లో షిగెల్లా కొత్త కేసు నమోదైంది. పుత్తియప్పలోని ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. కేరళలో ఈ షిగెల్లా మొదటి కేసు ఏప్రిల్ 27న నమోదైందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ వ్యాధి ఇంకా ఎవరికీ వ్యాపించలేదని అంటున్నారు. షిగెల్లా సోకిన బాలికతో పాటు పక్కంట్లోని మరో చిన్నారిలోనూ షిగెల్లా అనుమానిత లక్షణాలు ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతానికి ఆ ఇద్దరి బాధిత బాలికల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందంటున్నారు. షిగెల్లా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా వ్యాధి వ్యాపిస్తుందని గుర్తించారు. ఇది కూడా ఒక అంటువ్యాధిగా నిర్ధారించారు. ఒకరి నుంచి మరొకరికి సులభంగా బ్యాక్టీరియా వ్యాపించగలదని హెచ్చరిస్తున్నారు.
ఇంతకీ, ఈ షిగెల్లా వ్యాధి ఎలా సోకుతుంది.. దీని వ్యాప్తి ఎలా ఉంటుంది.. ఏయే లక్షణాలు ఎలా ఉంటాయి..? వ్యాధి సోకినవారిని గుర్తించడం ఎలా అనేవి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. షిగెల్లా బ్యాక్టీరియా సోకిన బాధితుల్లో ముందుగా జ్వరం వస్తుంది. దాంతో పాటు తీవ్ర కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట వంటి తీవ్ర లక్షణాలు ప్రాథమికంగా కనిపిస్తాయని వైద్యులు నిర్ధారించారు. ఈ షిగెల్లా అనే బ్యాక్టీరియా కలుషిత నీరు తాగడం ద్వారా, పాడైన ఆహారం తినడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిచెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Kerala’s Kozhikode Reports Shigella Infection Again, Health Dept Starts Preventive Measures
ఈ వ్యాధి సోకిన ఐదేళ్లలోపు పిల్లలకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కాంటాక్ట్ అయినా వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ షిగెల్లా వ్యాధి శరీరంలోకి ప్రవేశించిన 2 నుంచి 7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతాయని వైద్యులు వెల్లడించారు. గతంలోనూ షిగెల్లా వ్యాధిని కేరళను ముప్పు తిప్పలు పెట్టింది. మళ్లీ షిగెల్లా కేసు నమోదు కావడంతో కేరళ అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. కేసులు పెరిగిపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా కఠిన ఆంక్షలు విధించనుంది.
Read Also : Corona New Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
