Raksha Bandhan 2024: భర్తకు భార్య రాఖీ కట్టవచ్చా?
కొందరు భర్తకు రాఖీ కడతారు. మరికొందరు తండ్రికి కూడా కడతారు. ఇలా..
- T Venkateshwarlu
- Published On : August 18, 2024 / 09:30 PM IST
Raksha Bandhan 2024
‘రక్షాబంధన్’ భారతీయులు ఎంతో గొప్పగా జరుపుకునే వేడుక. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుంబంధానికి ప్రతీకగా దేశమంతటా ఈ పండుగను జరుపుకుంటారు. ఆరోజు అన్నదమ్ములకి, అక్కచెల్లెళ్లు రాఖీ కడతారు. అయితే భర్తకు కొందరు రాఖీ కడతారు. అలా కట్టవచ్చా? అంటే కట్టవచ్చును అని చెబుతారు. దీనికి సంబంధించి ప్రాచుర్యంలో ఉన్న కథ గురించి తెలుసుకుందాం.
రాఖీ అంటే రక్షగా ఉంటామని అన్నదమ్ములు ఇచ్చే వాగ్దానం. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా రాఖీ కట్టిన సోదరికి అండగా నిలబడి వారిని ఎల్లవేళలా రక్షించాలి. అసలు ఈ రాఖీ కట్టే సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పే కథ గురించి తెలుసుకుందాం. వేదకాలంలో రాక్షసులు, దేవతల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధం శ్రావణమాసంలో పౌర్ణమి రోజు జరిగింది. రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో ఇంద్రుడు ఆందోళనలో పడతాడు.
రాక్షసులు యుద్ధంలో గెలిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి ఆలోచిస్తూ భయపడిన ఇంద్రుడు తన గురువు ‘బృహస్పతి’ని సలహా అడిగాడు. ఇంద్రుడి భార్య ఇంద్రాణితో అతని మణికట్టుపై రాఖీ కట్టమని బృహస్పతి సూచిస్తాడు. అతని సలహాతో ఇంద్రాణి శ్రావణ పౌర్ణమినాడు ఇంద్రుడి మణికట్టుకు రాఖీ కట్టింది. ఆమె రక్షగా కట్టిన దారం ఎంత శక్తివంతంగా పనిచేసిందంటే యుద్ధంలో దేవతల విజయానికి దోహదపడింది. అప్పటి నుంచి రాఖీ కట్టడం కొనసాగింపుగా మారింది. అయితే తమకు రక్షగా ఉండమని అన్నకు చెల్లెలు, అక్కకు తమ్ముడు రాఖీలు కట్టే సంప్రదాయం అమలైంది.
ఈ కథ ప్రకారం భర్తకు భార్య రాఖీ కట్టడంలో తప్పు లేదని చెబుతారు. తండ్రికి కూతురు కూడా రాఖీ కట్టవచ్చు అని చెబుతారు. కొందరికి తోడబుట్టిన సోదరులు ఉండకపోవచ్చును. అలాంటి వారు కూడా తాము సోదరుడిలాగ
భావించేవారికి రాఖీ కడతారు. అందులో ఏ మాత్రం తప్పులేదని స్పష్టం చేస్తున్నారు. రాఖీ అనేది రక్షగా ఉంటామని ఇచ్చే వాగ్దానానికి ప్రతీక. తమకు రక్షణగా నిలిచిన వ్యక్తులకు మహిళలు రాఖీ కడతారు. ఈ ఏడాది రాఖీ వేడుక ఆగస్టు 30న జరుపుకుంటున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నా ఈరోజు తప్పకుండా కలుసుకుని అన్నలకు చెల్లెళ్లు రాఖీ కడితే.. అన్నలు సంతోషంగా వారికి కానుకలు ఇస్తారు.
