నేడు (అక్టోబర్ 30,2019) అంతర్జాతీయ పొదుపు దినోత్సవం. జీవితంలో పొదుపు ఎంతో అవసరం. ఆ పొదుపే మనల్ని కాపాడుతుంది. ధనమూలం ఇదం జగత్ అంటారు.
నేడు (అక్టోబర్ 30,2019) అంతర్జాతీయ పొదుపు దినోత్సవం. జీవితంలో పొదుపు ఎంతో అవసరం. ఆ పొదుపే మనల్ని కాపాడుతుంది. ధనమూలం ఇదం జగత్ అంటారు. ఆదాయానికి అనుగుణంగా ఖర్చుచేసి రేపటి బంగారు భవిష్యత్తు కోసం కొంత మిగుల్చుకోవటమే ‘పొదుపు’ చేయడం అంటారు. జీవితం అనే బండిని సాఫీగా నడపడానికి ‘ధనం’ ఇంధనంగా మారింది. మనిషి మనసు కోరికల పుట్ట. అయితే కోరికలన్నింటిని తీర్చుకోవటం ఎవరికీ సాధ్యపడదు. ముఖ్యంగా ధనం, ఆహారం, వస్త్రాలు, విశ్రాంతి, సమయం, శక్తి విషయాల్లో పొదుపును పాటించాలి. సుఖమైన జీవనానికి డబ్బు చాలా ముఖ్యం. దీన్ని పొదుపుగా వాడుకోవటం అందరి కర్తవ్యం.
అయితే రోజులు మారాయి. అవసరం లేకున్నా కొనుగోళ్లు పెరిగాయి. దీంతో అప్పులపైనే బతకాల్సి వస్తోంది. రేపటి గురించి ఆలోచన చేయడం లేదు. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఎటు చూసినా పొదుపు తగ్గింది.. ఖర్చు పెరిగింది. ఈ శైలి రానున్న రోజుల్లో పెద్ద సమస్యను తీసుకురానుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తులకే కాదు దేశానికి కూడా సమస్యగా మారనుందని టెన్షన్ పడుతున్నారు.
పొదుపు గురించి భారతీయులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. రేపటి గురించి ఆలోచన చేసి సేవింగ్స్ చేస్తారు. కష్ట కాలంలో ఆ పొదుపే ఇంటి అవసరాలు తీరుస్తుంది. కానీ పరిస్థితులు మారిపోతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఆదాయం పెరిగింది. సంపాదించే వారి సంఖ్యా పెరిగింది. పొదుపు మాత్రం తగ్గింది. రేపటి గురించి ఎవరూ ఆలోచన చేయడం లేదు. ఏటేటా దేశంలో పొదుపు శాతం గణనీయంగా తగ్గుతోందని నివేదికలు చెబుతున్నాయి.
ఒకప్పుడు రూ.100 ఆదాయం వస్తే.. రూ.75 ఖర్చు చేసి మిగతాది దాయడం అలవాటుగా ఉండేది. పదేళ్ల క్రితం ఆర్థిక మాంద్యం దెబ్బకు ప్రపంచలోని పలు దేశాల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. మన దేశంపై ఆ ప్రభావం నామమాత్రంగానే ఉంది. అందుకు కారణం ఇక్కడి ప్రజల్లో పొదుపు అలవాటు ఎక్కువగా ఉండటమే అనే విశ్లేషణలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ పొదుపు అదుపు తప్పుతోంది. చాలామంది ఆదాయమే కాదు.. అప్పు చేసి ఖర్చులు పెట్టేందుకూ సిద్ధమవుతున్నారు. ఫారిన్ కంట్రీస్ లో ప్రజలు సాధారణంగా వచ్చింది వచ్చినట్లుగా ఖర్చు చేసేస్తారు. రేపటి గురించి పెద్దగా పట్టించుకోరు. విదేశీ సంస్కృతి బలంగా మన దేశంలోకి వచ్చి చేరుతున్న ప్రస్తుత తరుణంలో మనకూ అలాంటి దుబారా ఖర్చుల తీరు అలవాటైపోతోంది.
గతంతో పోలిస్తే.. ఇప్పుడు లోన్లు తీసుకొంటున్న వారి సంఖ్య పెరిగింది. ఇందులో ఎక్కువగా గృహ రుణాలు ఉంటున్నాయి. క్రెడిట్ కార్డుల వినియోగమూ పెరిగింది. హామీ లేకుండా తీసుకునే పర్సనల్ లోన్లు గత ఐదారేళ్లలో మూడు రెట్లు పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.76 లక్షల కోట్ల హామీ లేని రుణాలు తీసుకోగా.. 2017-18లో ఇవి దాదాపు రూ. 5.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే.. వ్యక్తులు ఆస్తులను సృష్టించే వాటికన్నా.. ఖర్చులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థమవుతోంది. వడ్డీ రేట్లు తగ్గడం, సులువుగా రుణాలు లభిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం.
ప్రపంచంలోనే అధికంగా పొదుపు చేసే అలవాటున్న భారతదేశం గత ఐదారేళ్లుగా ఆ పేరును క్రమంగా కోల్పోతోంది. ఖర్చులు బాగా పెరిగాయి. ఆదాయాలు మాత్రం అదే రేషియోలో పెరగడం లేదు. దీంతో పొదుపు, పెట్టుబడులు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడు ఏ అవసరం ఎలా వస్తుందో చెప్పలేం. సాలరీ వచ్చేదాకా ఆ అవసరాన్ని వాయిదా వేయలేం. అనుకోకుండా ఉద్యోగం పోయినా.. ఏదైనా అనారోగ్యం ఏర్పడినా.. ఖర్చులకు తడుముకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి కష్ట సమయాల్లో ఆదుకునేందుకు కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇలా పొదుపు చేయండి:
* ఒకప్పుడు పొదుపు అంటే.. బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లేదా పోస్టాఫీసు పథకాలే ఉండేవి. ఇప్పుడు అనేక పథకాలు అందుబాటులోకి వచ్చాయి.
* ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి.
* పీపీఎఫ్ కూడా ప్రభుత్వ హామీ ఉన్న పథకం.
* చిన్న మొత్తాలతోనూ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
* మ్యూచువల్ ఫండ్స్ లో (సిప్) ఇన్వెస్ట్ చేస్తూ దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించవచ్చు.
* ఇవన్నీ నేటి చిన్న చిన్న మొత్తాలు రేపు పెద్ద నిధిగా మారే అవకాశాన్ని కల్పిస్తాయి.
* ఆదాయం రాగానే ఖర్చుల గురించి ఆలోచించొద్దు
* ముందుగా 5, 10 తేదీల్లోగా మనం చేయాల్సిన పొదుపు గురించి చూసుకోవాలి. ఆ తర్వాతే ఖర్చులు.
* కనీసం 30 శాతం పొదుపు చేస్తేనే భవిష్యత్తుకు ఒక భరోసా
* పొదుపు చేయకపోవడానికి ప్రధాన ఆటంకం అప్పులు. వాటిని తీసుకున్నప్పుడు నెలవారీ వాయిదాలు చెల్లించేందుకే మన ఆదాయం సరిపోతుంది. ఇక మిగిలేది ఎక్కడ? ఆదాయంలో పొదుపు పోను.. మిగిలిన మొత్తంలో 40 శాతానికి మించి నెల వాయిదాలు ఉండకుండా జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు.
* పొదుపు, పెట్టుబడులతోనే మన జీవన శైలి మారాలే కానీ.. అప్పులతో కాదని గుర్తించాలి.
* ఆన్ లైన్ లో కొనుగోళ్ల పద్ధతిని మార్చుకోవాలి. నచ్చిన వస్తువును కొనాలనుకున్నప్పుడు 36 గంటలు వేచి చూడండి. అప్పటికీ ఆ వస్తువు కొనాలనే ఆలోచన బలంగా ఉంటేనే నిర్ణయం తీసుకోండి.
ప్రస్తుత ఖర్చు ఆధారంగా భవిష్యత్తులో ఎంత అవసరమో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు తక్కువే. చాలామందికి రిటైర్ మెంట్ ప్రణాళిక అంటూ కచ్చితంగా ఏదీ లేదు. ఆదాయం ఆగిపోయాక.. ఏం చేయాలన్న ఆలోచన లేకుండానే ఉద్యోగం లేదా వ్యాపారం ఆపేస్తే ఇబ్బందులు తప్పవు.
రేపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే ఈ రోజే సుఖపడుదామనుకునేవారి సంఖ్య ఎక్కువైంది. ఒకప్పుడు మధ్య తరగతి వారు ఎగువ మధ్యతరగతి స్థాయికి చేరుకోవాలనేవారు. కానీ ఇప్పుడు ఈ ధోరణి మారింది. ఒక వ్యక్తి ఖర్చు చేస్తున్న దాన్ని బట్టి అతని వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తున్నారు. కానీ రూపాయిని మిగిలిస్తే, రూపాయిని సంపాదించినట్టే అనేది తెలుసుకోవాలి.
కేవలం డబ్బుని మాత్రమే పొదుపు చేయడం కాదు.. విద్యుత్, ఆహారం, నీరు తదితర విషయాలలోనూ పొదుపు పాటించాలి. ప్రతి మనిషి తన సంపాదనలో కనీసం 20 శాతం పొదుపు చేస్తే మంచిదని ఆర్థిక శాస్తవ్రేత్తల అభిప్రాయం. అందుకే ‘పొదుపు’లోని ప్రాముఖ్యతను వివరించడానికి ప్రపంచ పొదుపు దినోత్సవం జరుపుకుంటారు.
మనిషి ఎంత సంపాదిస్తున్నాడు అనేదానికంటే ఎంత పొదుపు చేస్తున్నాడనేదే ముఖ్యం. సంపాదించినదంతా ఖర్చు చేస్తూ పోతే ఫలితం ఉండదు. తాము పొదుపు చేస్తూ ఇతరులకు పొదుపు చేయడం నేర్పాలి. పొదుపు చేయటాన్ని కొందరు వ్యంగ్యంగా పిసినారితనమని అంటారు. కానీ బంగారు భవిష్యత్తుకు బంగారు బాట పొదుపు అని తెలుసుకోలేక తర్వాత బాధపడతారు. వచ్చిన సంపాదనలో కొంత దాచుకోవడం వల్ల మనం అభివృద్ధి చెందడమే కాక దేశం కూడా అభివృద్ధి చెందుతుందనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.