Adulterated milk: కల్తీ పాలు అమ్మాడని ఓ వ్యక్తిపై 1990లో ఫిర్యాదు నమోదైంది. అతడిని దోషిగా గుర్తించిన న్యాయస్థానం అతడికి శిక్ష విధిస్తూ నిన్న తీర్పు చెప్పింది. కల్తీ పాలు అమ్మిన వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధించింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్నగర్ లో 1990, ఏప్రిల్ 21 (దాదాపు 33 ఏళ్ల క్రితం) ఓ వ్యక్తి కల్తీ పాలు అమ్మాడు.
ఈ విషయాన్ని గుర్తించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ సురేశ్ చంద్.. పాలు అమ్మిన హర్బిత్ సింగ్ పై న్యాయస్థానంలో అప్పట్లో ఫిర్యాదు నమోదు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం అన్ని ఆధారాలను సేకరించింది. పాల శాంపిల్ సేకరించి ల్యాబ్ కి పంపారని, ఆ పాలు కల్తీవేనని తేలిందని ప్రాసిక్యూషన్ అధికారి రమావతార్ ఇవాళ మీడియాకు తెలిపారు.
దీంతో ఆ పాల వ్యాపారి హర్బిత్ సింగ్ ను కోర్టు దోషిగా తేల్చిందని చెప్పారు. నిన్న ఆ పాల వ్యాపారికి అడిషనల్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ప్రశాంత్ కుమార్ ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించారని వివరించారు.