నిర్మాతగా మారిన రెహమాన్.. ఇప్పుడు ప్రపంచానికి చెప్పాల్సిన కథ

  • Publish Date - June 13, 2020 / 01:47 AM IST

ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత స్వరకర్త ఎఆర్ రెహమాన్ నో ల్యాండ్స్ మ్యాన్ సినిమా కోసం సహ నిర్మాతగానూ, స్వరకర్తగా కూడా మారారు. బంగ్లాదేశ్ చిత్రనిర్మాత మోస్టోఫా సర్వార్ ఫారూకీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆస్ట్రేలియా థియేటర్ ఆర్టిస్ట్ మేగాన్ మిచెల్ మరియు బంగ్లాదేశ్ సంగీతకారుడు-నటుడు తహ్సాన్ రెహ్మాన్ ఖాన్ నటించారు.

ఇది అమెరికా-ఇండియా-బంగ్లాదేశ్‌ సినిమా. జాతిపరంగా విభజించబడిన ఈ ప్రపంచంలోని హానికర వ్యక్తులపై ఫోకస్‌ చేస్తూ సాగే సినిమా ఇది. ఈ సినిమా నిర్మించాలనుకోవడానికి గల ముఖ్య కారణం గురించి రెహమాన్‌ చెబుతూ.. ‘‘కొత్త ప్రపంచంలో ఎప్పుడూ కొత్త సవాళ్లు ఉంటాయి. అందుకని కొత్త కథలు చెప్పడానికి కుదురుతుంది. ఈ చిత్రకథ అలాంటిదే. ఇప్పటి ప్రపంచానికి చెప్పాల్సిన కథ, ఇప్పటి సమయానికి తగ్గ కథ’’ అని అన్నారు.

నవాజుద్దిన్‌ సిద్ధిఖీ మాట్లాడుతూ – ‘‘“ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ అనుభవం సవాలుగా మారింది. కానీ అది మేం పూర్తి చేశాం.. నటుడిగా నాకు సంతృప్తినిచ్చింది. ఏఆర్‌ రెహమాన్‌ ప్రతిభ ‘నో ల్యాండ్స్‌ మ్యాన్‌’ని గొప్ప సినిమాగా నిలబెడుతుంది’’ అన్నారు.

ఈ సినిమా కథ విషయానికొస్తే… అమెరికాలో ఒక ఆస్ట్రేలియన్ మహిళను కలిసిన తరువాత దక్షిణాసియాకు చెందిన వ్యక్తి జీవితం ఎలా మారిపోయింది అనేదే చిత్ర కథ. ఆసిఫ్‌ మాండ్వి రాసిన ‘నో ల్యాండ్స్‌ మ్యాన్‌’ పుస్తకం ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ సినిమా ఉంటుంది.