Telugu Film Industry: టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్.. సమ్మె సైరెన్ మోగించనున్న సినీ కార్మికులు

టాలీవుడ్‌లో సమ్మె సరైన్ మోగనుంది. కరోనా ప్రభావంతో గతకొంత కాలంగా తమ జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయని, తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ....

Telugu Film Industry: టాలీవుడ్‌లో సమ్మె సరైన్ మోగనుంది. కరోనా ప్రభావంతో గతకొంత కాలంగా తమ జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయని, తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, సినీ కార్మికులు నిరసనకు దిగుతున్నారు. ఈ నెల 22 నుంచి అన్ని రకాల షూటింగ్‌లకు సినీ కార్మికులు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపారు.

ఈ నెల 22న ఫిలిం ఫెడరేషన్ ముట్టడికి 24 విభాలకు చెందిన సినీ కార్మికులు పిలుపునిచ్చారు. ఫిలిం ఫెడరేషన్‌లోని 24 క్రాఫ్టుల్లో జీతాలు పెంచాల్సి ఉంది. ఈ వ్యవహారం చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది. కరోనా వల్ల రెండేళ్లు ఆలస్యమైంది. ఇప్పటికైనా తమ గోడును సినీ పెద్దలు వినిపించుకోవాలని కార్మికులు కోరుతున్నారు. తక్షణమే తమ వేతనాలు పెంచి, తమను ఆదుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు.

నిర్మాత మండలి సినీ కార్మికుల వేతనాల పెంపుపై స్పందించడం లేదని.. 24 విభాగాల్లోని ఒక్కో కార్మిక సంఘ నాయకులతో చర్చిస్తున్నామని.. రేపటి నుండి షూటింగ్‌ల నిలిపివేతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రతి రెండేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు పెరగాలని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు. మరి సినీ కార్మికుల డిమాండ్‌కు నిర్మాత మండలి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. ఒకవేళ వారి దగ్గర్నుండి సరైన సమాధానం రాకపోతే, సమ్మె సైరెన్ మోగడం తథ్యం అని అంటున్నారు సినీ కార్మికులు.

ట్రెండింగ్ వార్తలు