Gautham Vasudev Menon : గౌతమ్ మీనన్కి షాకిచ్చిన హైకోర్టు.. ఆ నిర్మాతకు రూ.4.25 కోట్లు వడ్డీతో చెల్లించాలని ఆదేశం
Gautham Vasudev Menon : ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కి మద్రాస్ హైకోర్టు భారీ షాకిచ్చింది. జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
- Dharani Pilli
- Updated on- March 24, 2026 / 12:10 PM IST
Madras High Court verdict to direct Gautham Vasudev Menon to pay Rs 4 25 Cr
Gautham Vasudev Menon : ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్కి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. అతని ప్రొడక్షన్ హౌస్ ఫోటాన్ ఫ్యాక్టరీ దాఖలు చేసిన అప్పీల్ను తిరస్కరించింది. పైగా ఈ కేసులో గౌతమ్ మీనన్.. ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్కు రూ. 4.25 కోట్లు చెల్లించాలని.. అది కూడా 2010 మే నుండి ఇప్పటి వరకు.. సంవత్సరానికి 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా కోర్టు సమర్థించింది.
ఈ వివాదం 2008 నవంబర్ 27న ప్రారంభమైంది. ప్రొడక్షన్ నెం. 6 సినిమా కోసం గౌతమ్ మీనన్ సంస్థ ఫోటాన్ ఫ్యాక్టరీ.. నిర్మాత ఎల్రెడ్ కుమార్ (ఆర్.ఎస్. ఇన్ఫోటైన్మెంట్)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం.. 2009, ఏప్రిల్ 5 నాటికి ఈ సినిమా పూర్తవ్వాలి. ఈ క్రమంలో నిర్మాత పలు విడతల్లో రూ. 4.25 కోట్లు చెల్లించారు. కానీ ఒప్పందం ప్రకారం… అనుకున్న సమయానికి ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో 2010 ఫిబ్రవరి 12 వరకు అదనపు గడువు కూడా ఇచ్చారు. అయినా ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు.
దీంతో నిర్మాత 2013లో ఈ అంశంపై సివిల్ సూట్ వేశారు. సినిమా నిర్మాణం కోసం తాను రూ. 4.25 కోట్లు పలు దఫాలుగా ఇచ్చానని.. కానీ నిర్ణీత సమయంలో సినిమా ప్రారంభం కాలేదని తెలిపారు. నిర్ణీత గడువులో సినిమా పూర్తి కాకపోతే.. ఆ మొత్తానికి 24 శాతం వడ్డీతో చెల్లిస్తామనే క్లాజ్ కూడా ఉందని కోర్టుకి తెలిపారు.
ఈ క్రమంలో గౌతమ్ మీనన్ కోర్టులో తన వాదన వినిపించారు. తాము నిర్మించిన ‘నీతానే ఎన్ పొన్వసంతం’ (తెలుగులో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’) చిత్రమే ఆ ఒప్పందం కింద డైరెక్ట్ చేసిన సినిమా అన్నారు. ఒప్పందం ప్రకారం సినిమా తీసి విడుదల చేశామని.. ఇక తమ బాధ్యత తీరిపోయిందని గౌతమ్ మీనన్ కోర్టులో వాదించారు. అయితే న్యాయస్థానం ఈ వాదనను అంగీకరించలేదు. ఆ సినిమా వేరే ఒప్పందం కింద రూపొందిందని న్యాయమూర్తి గుర్తించారు. ఈ నేపథ్యంలో గౌతమ్ మీనన్, అతని సంస్థ రూ. 4.25 కోట్లు 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
తాజాగా డివిజన్ బెంచ్ కూడా గౌతమ్ మీనన్ అప్పీల్ను తిరస్కరించడమే కాక.. గత తీర్పును సమర్థించింది. గతంలో పేర్కొన్నట్లే.. ఏడాదికి 12 శాతం వడ్డీతో రూ. 4.25 కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. గత తీర్పు ఇప్పుడు ఖరారైంది. అదనంగా, కోర్టు, లాయర్ ఖర్చుల కింద రూ. 12 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
