Rashid Siddiqui opposes Rs 500 crore defamation notice : బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, యూ ట్యూబర్ రషీద్ సిద్ధిఖీ మధ్య వార్ కొనసాగుతోంది. తన పరువుకు భంగం కలిగించినందుకు రూ. 500 కోట్లు చెల్లించాలంటూ..డిమాండ్ చూస్తూ..అక్షయ్ కుమార్ నవంబర్ 17న నోటీసులను సిద్ధిఖీకి పంపించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో రషీద్ యూ ట్యూబ్ లో తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని అక్షయ్ తన నోటీసుల్లో వెల్లడించారు. అయితే…వీటిని తీసుకోవడానికి సిద్ధిఖీ నిరాకరిస్తున్నాడు. ఆత్మహత్యకు సంబంధించి FF News ఛానెల్ లో ఎలాంటి ఆధారాలు లేకుండా..అవమానకరమైన రీతిలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అక్షయ్ ఆరోపిస్తున్నారు.
దీనిపై సిద్ధిఖీ స్పందించాడు. తనకు పంపించిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరంగా ముందుకెళుతానని సిద్ధిఖీ వెల్లడించడం గమనార్హం. తన న్యాయవాది జేపీ జైస్వాల్ ద్వారా శుక్రవారం నోటీసులు పంపించాడు. తనపై వేధింపులకు దిగుతున్నారని, తమ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్చ ప్రతీ పౌరుడికి ఉంటుందంటున్నాడు. తన ఛానెల్ లో వచ్చిన వీడియోలు పరువు నష్టం కిందకి రావని చెబుతున్నాడు. ఇతర న్యూస్ ఛానెల్ లో వచ్చిన సమాచారం ఆధారంగానే తాను అక్షయ్ పై వార్తలు ప్రసారం చేశానని వెల్లడిస్తున్నాడు. ఆగస్టులో వీడియోలు ప్రసారం చేస్తే…ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించాడు.
మహారాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగా తన యూ ట్యూబ్ ఛానెల్ లో అసత్య ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణలపై ముంబై పోలీసులు సిద్ధిఖీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తనను అరెస్టు చేయకుండా..నవంబర్ 03న సిద్దిఖీ ముందస్తు బెయిల్ పొందాడు.