యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం..
‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి : ది కన్ క్లూజన్’ సినిమాలతో యావత్ ప్రపంచం చూపు తెలుగు సినిమా వైపు తిప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవల్కి తీసుకెళ్లి, మన సినిమా స్థాయిని పెంచడమే కాక తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని, గౌరవాన్ని తీసుకొచ్చాడు. రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘#RRR’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల కలయికలో స్వాతంత్ర్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయనే వార్త ఫిలింనగర్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా వచ్చే ఏడాది జనవరి 8న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు టీమ్. మొదట ఈ ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. #RRR మూవీని పాన్ ఇండియా లెవల్లో పది భాషల్లో విడుదల చేయనున్నారు. దీనికి చాలా సమయం పడుతుందని తప్పని పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు #RRR నైజాం థియేట్రికల్ రైట్స్ ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు దిల్ రాజు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. కరెక్ట్ ఫిగర్ బయటకు రాలేదు కానీ దాదాపు రూ.100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సిినిమాలు ఎంత బిజినెస్ చేశాయో అంతకుమించి ఆర్ఆర్ఆర్ బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.