Sai Durgha Tej Meets Pawan Kalyan Photos and Videos goes Viral
Pawan Kalyan – Sai Durgha Tej : మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్, పవన్ కళ్యాణ్ మధ్య ఎంత మంచి అనుబంధం ఉందొ అందరికి తెలిసిందే. సాయి దుర్గ తేజ్ కి మామయ్య అంటే చాలా ఇష్టం. ఎన్నో సందర్భాల్లో వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ఈ మేనమామ – మేనల్లుడు కలిసి ఫ్యాన్స్ కి కనువిందు చేసారు.
సాయి దుర్గా తేజ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ అయి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన మేనమామ, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ సాయి దుర్గా తేజ్ ని ఈ సందర్భంగా అభిమానించారు. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : గేమ్చేంజర్ మూవీ టీమ్ భారీ ప్లాన్.. చెర్రీ కోసం బాలీవుడ్ బాద్ షా
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నటన పట్ల ఎంతో తపనతో ఎదుగుతూ వస్తున్నాడు సాయి తేజ్. నటుడిగా తొలి అడుగులు వేసినప్పటి నుంచీ సహ నటులు, సాంకేతిక నిపుణులపట్ల ఎంత గౌరవమర్యాదలతో ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. తను ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు కూడా ఎంతో ఆత్మ విశ్వాసం చూపించాడు. తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఆలోచనతో రహదారి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలో చైతన్యపరుస్తున్నాడు. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడేవారు, పోస్టులు పెట్టడంపై బలంగా స్పందిస్తున్న తీరు సాయి దుర్గా తేజ్ లోని సామాజిక బాధ్యతను తెలియచేస్తోంది. ఇటీవల విజయవాడలో వరదలు సంభవించినప్పుడు కూడా తన వంతు బాధ్యతగా స్పందించాడు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు.
సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ.. చిన్న మావయ్య ఆశీర్వాదం పొందటం చాలా సంతోషాన్ని కలిగించింది. ఆయన నా కెరీర్ కు మార్గదర్శిగా ఉన్నారు. చిన్నతనం నుంచి నాకు కళ్యాణ్ మావయ్యతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. స్కూల్లో చదివేటప్పుడు టెన్నిస్ ఆడేవాణ్ణి. ఒక టోర్నమెంట్ లో ఓడిపోయాను. ఇక ఆడను అని టెన్నిస్ రాకెట్ పక్కన పడేస్తే కళ్యాణ్ మావయ్య మోటివేట్ చేశారు. నీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. ఆటల్లో గెలుపోటములు సహజం, గెలిచే వరకూ ప్రయత్నించాలి అని చెప్పి మరో టోర్నమెంట్ కు పంపించారు. ఆ టోర్నీలో గెలిచాను. అప్పుడు మావయ్య బలంగా హత్తుకొని ముద్దుపెట్టారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి నన్ను ముందుకు తీసుకువెళ్తోంది అని తెలిపారు.