Gurthundhaa Seethakalam Movie Launched: కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకాభిమానం సొంతం చేసుకుంటున్న యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ప్రముఖ దర్శకుడు నాగశేఖర్ దర్శకత్వంలో నాగశేఖర్ మూవీస్ బ్యానర్పై నాగశేఖర్, భావన రవిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో సత్యదేవ్, దర్శకనిర్మాత నాగశేఖర్, సంగీత దర్శకుడు కాలభైరవ, సినిమాటోగ్రాఫర్ సత్య హెగ్డే, చిత్ర యూనిట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత నాగశేఖర్ మాట్లాడుతూ.. ‘‘గుర్తుందా శీతాకాలం టైటిల్కు తెలుగు ప్రేక్షకుల నుంచి అనుహ్యమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. అలానే ఈ సినిమా కోసం యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్నారు అని అనౌన్స్ చేసిన వెంటనే తెలుగు సినిమా మార్కెట్లో వచ్చిన క్రేజ్ మా చిత్ర యూనిట్ అందరిలో ఆనందంతో పాటు బాధ్యతను నింపింది. ఇప్పుడు మా ప్రాజెక్ట్పై తెలుగు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి, వారందరి ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను చిత్రీకరించడానికి మా యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో మా చిత్ర షూటింగ్ని అధికారికంగా ప్రారంభించాము, అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, సినిమాను సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము..’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కాలభైవర మాట్లాడుతూ.. ‘‘గుర్తుందా శీతాకాలం టైటిల్ వినగానే మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. ఈ సినిమాలో పాటలు విన్నా ఆడియెన్స్కు హాయిగా అనిపించేలా మ్యూజిక్ ఇవ్వడానికి నా సాయశక్తులా కృషి చేస్తాను. ఈ ప్రాజెక్ట్లోకి నన్ను తీసుకున్నందుకు దర్శకనిర్మాత నాగశేఖర్కు నా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను’’ అని అన్నారు.
డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ.. ‘‘గుర్తుందా శీతాకాలం దర్శకనిర్మాత నాగశేఖర్ నాకు ఈ సినిమా ఆఫర్ ఇచ్చి చాలా పెద్ద ఛాలెంజింగ్ వర్క్ ఇచ్చారు. ఆయన నాపై ఉంచిన నమ్మకానికి ఏ మాత్రం తగ్గకుండా సంభాషణలు రాస్తున్నాను. ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.