స్వదేశీ ‘కావేరి అమ్మ’ కన్నుమూత

ప్రముఖ కన్నడ నటి స్వదేశీ ‘కావేరి అమ్మ’గా గుర్తింపు పొందిన కిషోరి బల్లాళ్ అనారోగ్యంతో మృతి చెందారు..

  • Publish Date - February 19, 2020 / 05:17 AM IST

ప్రముఖ కన్నడ నటి స్వదేశీ ‘కావేరి అమ్మ’గా గుర్తింపు పొందిన కిషోరి బల్లాళ్ అనారోగ్యంతో మృతి చెందారు..

హీరో శ్రీకాంత్ తండ్రి, దర్శకులు వీర శంకర్ తండ్రి, తమిళ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ కొడుకు, కన్నడ వర్ధమాన గాయని.. ఇలా సినీ ప్రముఖుల వరుస మరణాలు చిత్రపరిశ్రమను కలవరపెడుతున్నాయి.

తాజాగా సీనియర్‌ కన్నడ నటి కిషోరి బల్లాళ్‌ (82 సంవత్సరాలు) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందడం శాండల్‌వుడ్‌లో విషాదం నింపింది.

బెంగళూరులోని ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. దక్షిణ కన్నడలో జన్మించిన బల్లాళ్‌ 1960లో ‘ఇవలెంత హెందాతీ’ చిత్రంతో వెండతెరపై తెరంగ్రేటం చేశారు.

అయిదు దశాబ్దాల సినీప్రయాణంలో సుమారు 75 సినిమాలకు పైగా నటించారు. బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘స్వదేశ్‌’ చిత్రంలో కావేరీ అమ్మగా ఆవిడ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 

ఈ సినిమా తర్వాత ఆమె చిత్ర రంగానికి దూరంగా ఉంటూ సీరియళ్లలో నటిస్తున్నారు. ఈ క్రమంలో అమృతబల్లాళ్‌ కన్నడ మెగా సీరియల్‌ ‘వర్షిణి’లో నటించారు.

‘అయ్య’, ‘కెంపేగౌడ’, ‘నమ్మణ్ణ’, ‘గేర్‌ కానూని’ వంటి పలు కన్నడ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులో వెంకటేష్ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రంలోనూ నటించారు.

ఆమె కెంపేగౌడ ప్రశస్తి, కన్నడ అకాడమీ ప్రశస్తి, ఐఫా ప్రశస్తిలను దక్కించుకున్నారు. విష్ణువర్ధన్‌, అంబరీష్‌, ప్రభాకర్‌, దర్శన్‌, సుదీప్‌లు నటించిన సినిమాల్లో నటించారు.

కిశోరి బల్లాళ్‌ మృతికి కర్ణాటక చలనచిత్ర మండలి అధ్యక్షుడు జయరాజ్‌తో పాటు అనేక మంది సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కన్నడ వర్ధమాన గాయని సుస్మిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే సీనియర్ నటి కిషోరి బల్లాళ్ కన్నుమూయడం బాధాకరం.