Tollywood screenwriter Akella Suryanarayana passed away
Akella Suryanarayana : టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ రచయిత ఆకెళ్ళ సూర్యనారాయణ కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 1950 ఫిబ్రవరి 10న ఆకెళ్ళ సూర్యనారాయణ (Akella Suryanarayana)జన్మించారు. బాల్యంలోనే నాటక రంగంలో నటుడిగా అడుగుపెట్టారు. ఆ తరువాత ప్రతికలకు కథలు రాయడంతో రచయిగా ఆయన ప్రస్థానం మొదలైంది. డిగ్రీ పూర్తి అయిన తరువాత నాటికలు, నాటకాలు, పద్య నాటకాలు రాశారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన మగమహారాజు చిత్రంతో ఆయన సినీ రచయితగా కెరీర్ ప్రారంభించారు. 80కి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలను, మాటలను అందించారు. స్వాతిముత్యం, శ్రుతిలయలు, ఆడదే ఆధారం, సిరివెన్నెల, శ్రీమతి ఒక బహుమతి, నాగదేవత, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఓ భార్య కథ, ఆయనకి ఇద్దరు, చిలకపచ్చ కాపురం, ఔనన్నా కాదన్నా వంటి చిత్రాలు ఆయనకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టాయి. అయ్యయ్యో బ్రహ్మయ్య చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.
Tunnel Review : ‘టన్నెల్’ మూవీ రివ్యూ.. తల్లి అయ్యాక లావణ్య త్రిపాఠి మొదటి సినిమా..
సినీ, నాటక రంగాలకు సంబంధించి మొత్తం 13 నంది అవార్డులు అందుకున్నారు. అలానే ఆయన రాసిన కథలకూ బహుమతులు వచ్చాయి. ఆకెళ్ళ రాసిన తొలి నాటకం ‘కాకి ఎంగిలి’ సాహిత్య అకాడమీ అవార్డును పొందింది. ఆయన రెండు వందల కథలు, ఇరవై నవలలు, 800 కు పైగా టీవీ ఎపిసోడ్స్ కు రచన చేశారు.
ఆయనకు ఐదుగురు సంతానం. నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. శనివారం ఆయన అంత్యక్రియలు హైదరాబాద్లోని నిజాంపేటలో జరగనున్నాయి.