పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో (INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC)లు సంయుక్తంగా జనవరి 8న దేశ వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. వివిధ కార్మిక సంఘాలతో పాటు, బ్యాంకింగ్ సంఘాలు, వివిధ రంగాల స్వతంత్ర సమాఖ్యలు, సంఘాలు సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాయి.
ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8 న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సుమారు 25 కోట్ల మంది పాల్గొంటారని పది కేంద్ర కార్మిక సంఘాలు సోమవారం తెలిపాయి. జనవరి 2, 2020న తమ డిమాండ్ల గురించి జరిగిన సమావేశంలో కార్మిక మంత్రిత్వ శాఖ విఫలమైందనీ అభిప్రాయపడ్డారు. అందుకే కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి హక్కులను రక్షించుకునేందుకు జనవరి 8న అఖిల భారత సమ్మె చేపట్టనున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా స్వరం పెంచే ఎజెండాతో 60 మంది విద్యా సంస్థల నుంచి విద్యార్థులు, కొన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలు కూడా సమ్మెలో పాల్గొనాలని కోరారు. దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల ఫలితంగా నిజ వేతనాలు పడిపోయాయననీ, అనేక ప్రభుత్వరంగ సంస్థలలో కూడా వేతన సవరణలు పెండింగ్లో ఉన్నాయని కార్మిక సంఘాలు ఆరోపించాయి.
ఎయిరిండియా, బీపీసీఎల్ విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనీ పేర్కొన్నాయి. అలాగే BSNL-MTNL విలీనం తరువాత 93వేల 600 టెలికాం కార్మికులు ఇప్పటికే VRS కింద ఉద్యోగాలను కోల్పోయారని విమర్శించారు. రైల్వేలలో ప్రైవేటీకరణ, 49 రక్షణ ఉత్పత్తి యూనిట్ల కార్పొరేటైజేషన్, ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.