భారత్-చైనా ఎఫ్డీఐ నిబంధనలు యథాతథం
- venkaiahnaidu
- Published On : February 23, 2021 / 07:37 PM IST
Centre తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరణ తర్వాత కూడా చైనాతో భారత్కు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బలగాల ఉపసంహరణ తర్వాత చైనాపై ఆంక్షలను ఎత్తివేస్తారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది.
చైనాతో భారత్కు ఉన్న ఎఫ్డీఐ నిబంధనల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. భవిష్యత్లో రద్దు చేయాలన్న ప్రణాళిక సైతం మా వద్ద లేదు. ఎప్పటిలాగానే చైనా నుంచి వచ్చే కంపెనీలు భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. నిబంధనలు పాటించాలి. దేశ భద్రతకు ముప్పు లేదని భావించిన కంపెనీలకే కేంద్ర అనుమతి ఉంటుంది అని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
అయితే హాంకాంగ్కు చెందిన సిటిజెన్ వాచెస్ కంపెనీ, జపాన్కు చెందిన నిప్పన్ పెయింట్స్ కంపెనీకి, నెట్ ప్లే అనే స్పోర్ట్స్ కంపెనీకి కేంద్రం ఇటీవల అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా, గల్వాన్ ఘటన తరువాత చైనాపై ఎఫ్డీఐ ఆంక్షలను కఠినతరం చేసింది భారత్. చైనాకు చెందిన కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది.
