Akhilesh Yadav : బీజేపీపై అఖిలేష్ ఫైర్..ఓటమి భయంతో వేధింపులు
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
- venkaiahnaidu
- Published On : June 15, 2021 / 02:49 PM IST
Akilesh
Akhilesh Yadav యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇటీవల జరిగిన యూపీ పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన బీజేపీ ప్రభుత్వం సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు, నేతలను వేధింపులకు గురిచేస్తోందని సోమవారం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమితో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు తప్పదనే భయం బీజేపీని వెంటాడుతోందని, దిక్కుతోచని స్థితిలో అధికార బీజేపీ తమ పార్టీ నేతలు, కార్యకర్తలను వేధిస్తోందని అఖిలేష్ ఆరోపించారు. కొవిడ్ నిబంధలను ఉల్లంఘించారనే సాకుతో సమాజ్ వాది పార్టీ కార్యకర్తలను వేధిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలను హింసిస్తూనే మరోవైపు బీజేపీ నేతలు కొవిడ్-19 ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తున్నా యూపీ సర్కార్ వారిని సమర్ధిస్తూ ద్వంద ప్రమాణాలు పాటిస్తోందని అఖిలేష్ ఫైర్ అయ్యారు.
ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. యూపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎస్పీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, సత్తా చాటాలని బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు రెడీ అవుతున్నాయి.
