×
Ad

Al Falah University : అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీ అరెస్ట్

అల్ ఫలాహ్ యూనివర్సిటీ (Al-Falah University) ఛైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Al Falah University

Al Falah University : అల్ ఫలాహ్ యూనివర్సిటీ (Al-Falah University) ఛైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక కోర్టులో ఆయన్ను హాజరుపర్చగా.. న్యాయస్థానం సిద్దిఖీకి నాలుగు రోజుల రిమాండ్ విధించింది.

Also Read : Viveka Case : వివేక హత్య కేసు‌పై మరోసారి సుప్రీంకోర్టులో విచారణ ..

విద్యాసంస్థ పేరుతో భారీగా నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలతో ఆయన్ను అరెస్టు చేశారు. ఫీజులు, అడ్మిషన్ల విషయంలో విద్యార్థులు–తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్
పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీతో పాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఢిల్లీ పేలుళ్లపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఫిర్యాదు మేరకు చైర్మన్ సిద్ధిఖీపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యకలాపాలు ప్రారంభించిన అనంతరం క్రైమ్‌ బ్రాంచ్‌ ఈ చర్య చేపట్టింది. ఫోర్జరీ కోణంలో విచారణ సాగుతున్నది.

గతేడాది నవంబర్‌లో ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన తర్వాత భద్రతా సంస్థలు ఈ యూనివర్సిటీపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ యూనివర్సిటీకి చెందిన సుమారు రూ.140 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. 2018 నుంచి 2025 మధ్య కాలంలో ఈ విద్యాసంస్థ సుమారు రూ.415 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, ఆ నిధులను సిద్ధిఖీ వ్యక్తిగత అవసరాలకు మళ్లించినట్లుగా ఈడీ విచారణలో తేలింది. ఈ యూనివర్సిటీకి చెందిన కొందరు వ్యక్తులకు ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ అధికారులు సిద్ధిఖీని విచారిస్తున్నారు. ఫిబ్రవరి 13న ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జరగనుంది.