ముగిసిన బీహార్ మొదటి దశ ఎన్నికల ప్రచారం
- venkaiahnaidu
- Published On : October 26, 2020 / 09:33 PM IST
Bihar Election 2020: Campaign ends for first phase, polling on Oct 28 బీహార్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఇప్పటివరకు ప్రధానమోడీ మూడు ర్యాలీల్లో పాల్గొనగా…రాహుల్ గాంధీ రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మొత్తం 3దశల్లో ఎన్నికలు జరుగనుండగా…మొదటి దశలో బుధవారం(అక్టోబర్-28,2020) 71స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్-3న రెండో దశలో భాగంగా 94స్థానాలకు, మిగిలిన 78స్థానాలకు నవంబర్-7న పోలింగ్ జరుగనుంది. నవంబర్-10న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీచేస్తుండగా..ఆర్జేడీ-కాంగ్రెస్-మూడు లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీచేస్తున్నాయి. ఇక,కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి అయినప్పటికీ బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ(LJP)స్వతంత్రంగా పోటీ చేస్తోంది.
ఎన్డీయే కూటమిలో ప్రధాన పార్టీలైన బీజేపీ 110సీట్లలో పోటీలో ఉండగా,జేడీయూ 115అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక, మహాఘట్ బంధన్ కూటమిలో ప్రధాన పార్టీలైన ఆర్జేడీ 114స్థానాల్లో బరిలోకి దిగుతుండగా,70స్థానాల్లో కాంగ్రెస్ పోటీలో ఉంది. మరోవైపు, 143స్థానాల్లో మాత్రమే ఎల్జేపీ తన అభ్యర్థులను రంగంలోకి దింపింది
