టీవీ డిబేట్లలో పాల్గొనవద్దు

  • Publish Date - November 9, 2019 / 06:40 AM IST

వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీవీ డిబేట్లు, బైట్లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు, నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య తీర్పుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది.

సున్నిత అంశమైన ఈ తీర్పుపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాతే తాము స్పందిస్తామని ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు.

మరోవైపు బీజేపీ అధిష్టానం సైతం టీవీ డిబేట్లకు దూరంగా ఉండాలంటూ అధికార ప్రతినిధులకు ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పార్టీ అధికార ప్రతినిధులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా అయోధ్య తీర్పు నేపథ్యంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్‌ పర్యటనను వాయిదా వేసుకున్నారు.