పోన్లే పాపం : ముషారఫ్‌కు ఫాస్ట్ ట్రాక్ పౌరసత్వం ఇద్దాం : బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు 

  • Publish Date - December 20, 2019 / 04:46 AM IST

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామిపౌరసత్వ సవరణ చట్టంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉరి శిక్ష పడిన పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్  ముషారఫ్‌కు ఫాస్ట్‌ట్రాక్‌ భారత పౌరసత్వం ఇవ్వవచ్చని గురువారం (డిసెంబర్ 19) వ్యాఖ్యానించారు. ముషార్రఫ్‌ దరియాగంజ్‌కు చెందినవాడు. మతపరమైన బాధను ఎదుర్కొంటున్నారు..అతనికి భారత పౌరసత్వం ఇవ్వవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. తమ పూర్వీకులు హిందువులని చెప్పుకునే వారు పౌరసత్వ సవరణ చట్టం కింద పౌరసత్వానికి అర్హులే నంటూ సుబ్రమణ్యస్వామి ట్వీట్‌ చేశారు.

1999 నుంచి 2008 వరకు పాక్ కు అధ్యక్షుడిగా వ్యవహరించిన  ముషారఫ్‌కు లాహోర్ కోర్టు మరణ శిక్ష విధించింది.తీవ్రమైన దేశద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు.. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారనే అభియోగాలు ముషారఫ్ పై ఉన్నాయి.

సుదీర్ఘంగా ఈ కేసును విచారించిన ముగ్గురు న్యాయవాదుల బెంచ్.. ఎట్టకేలకు అతడ్ని నిందితుడిగా ప్రకటించింది.దీంతో లాహోర్ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది.ఒక దేశాధ్యక్షుడికి మరణశిక్ష విధించడం పాక్ లో ఇదే రెండోసారి.గతంలో పాక్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్‌ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే.