KS Eshwarappa: కర్ణాటక రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి త్వరలో మరో ముఖ్యమంత్రి రాబోతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప చేసిన తాజా వ్యాఖ్యలు కన్నడ రాజకీయంలో కాక రేపుతున్నాయి.
నాలుగు నెలల క్రితం బీఎస్ యడియూరప్పను కర్ణాటక ముఖ్యమంత్రిగా తప్పించి ఆ స్థానంలో బసవాజ్ బొమ్మైని కూర్చోబెట్టిన బీజేపీ అధిష్టానం తాజాగా మరోసారి మార్పుకు సిద్ధమైనట్లు కేఎస్ ఈశ్వరప్ప చెప్పకనే చెప్పారు. ఆదివారం ఓ పబ్లిక్ ర్యాలీలో మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ…ప్రస్తుతం బొమ్మై కేబినెట్ లో మంత్రిగా ఉన్న మురుగేష్ నిరాని తొందరలోనే కర్ణాటక సీఎం అవుతారని, అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది తాను స్పష్టంగా చెప్పలేనని అన్నారు.
బసవరాజ్ బొమ్మైని రేపే సీఎం పదవి నుంచి తొలగిస్తారని తాను అనడం లేదని, కానీ నిరాని త్వరలో సీఎం అవుతారు అని ఈశ్వరప్ప అన్నారు. మురుగేష్ నిరానికి ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో వెనుకబడిన తరగతికి చెందిన వర్గాల సంక్షేమం కోసం ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అవసరముందని కేఎస్ ఈశ్వరప్ప అన్నారు.
ALSO READ Omicron : ఒమిక్రాన్ తో తీవ్ర ముప్పు..ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక