BMC గత వారం రోజులుగా ముంబై పరిసర ప్రాంతాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కరోనా ఇంకా పూర్తిగా తగ్గలేదని ముప్పు ఉందని అందరు మాస్క్లు ధరించడం, చేతులు శుభ్రపరుచుకోవడం, భౌతిక దూరం మొదలగు మూడు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తూ వచ్చారు. కానీ, అనేక మంది నిర్లక్ష్యంతోపాటు లోకల్ రైళ్ల ప్రారంభం, స్వగ్రామాలకు వెళ్లిన వలస కార్మికులు తిరిగి ముంబై చేరుకోవడం వల్ల పెరిగిన రద్దీ,పెళ్లిల్లు, పార్టీలు, హోటల్స్, మాల్స్ లాంటి వాటిలో గుంపులు గుంపులుగా పాల్గొనడం తదితర కారణాల వల్ల మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
అయితే మురికివాడలలో అంతగా ప్రభావం కన్పించకపోయినప్పటికీ భవనాల్లో నివసించే వారిలో కరోనా ప్రభావం పెరిగింది. దీంతో అధికారులు భవనాలకు సీల్వేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఒక భవనంలో ఐదు కంటే అధికంగా కేసులు నమోదైతే ఆ భవనాలను సీల్ చేయడం ప్రారంభించించారు. ఇప్పటి వరకు 1,305 బిల్డింగ్స్ కు సీల్ వేశారు బీఎంసీ అధికారులు. దీంతో 70వేలకు పైగా గృహ నివాసితులు ప్రభావితమయ్యారు.
ప్రధానంగా ములూండ్ టీ విభాగంలో అత్యధికంగా 233 భవనాలను సీల్ చేశారు. ఘాట్కోపర్ ఎన్ విభాగం, గోరేగావ్ పి విభాగంలో 125 భవనాలను సీల్చేశారు. మరోవైపు దక్షిణ ముంబైలో గ్రాంట్ రోడ్డులో అత్యధికంగా 110 భవనాలను సీల్ చేశారు. ముంబై వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మరిన్ని భవనాలకు సీల్ వేసే అవకాశం ఉంది. భవనాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందు వల్ల అధికారులు నగరంలోని అన్ని హౌసింగ్ సొసైటీలను అప్రమత్తం చేశారు. కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తుల వివరాలను వెంటనే సంబంధిత విభాగానికి అందించాలని సూచించారు