మరో కీలక తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు రెడీ అయింది. గత శనివారం అయోధ్య కేసులో దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన చరిత్రాత్మక తీర్పునిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ(నవంబర్-13,2019) మరో కీలక తీర్పు ఇవ్వనుంది. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా భావించే సమాచార హక్కు(RTI)చట్టం పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) కార్యాలయాన్ని తీసుకురావాలా? వద్దా? అనే అంశంపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్లు ఎన్ వీ రమణ, డీ వై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరించనున్నది.
2010లో ఢిల్లీ హైకోర్టు…సీజేఐ కార్యాలయం సమాచార హక్కుచట్టం పరిధిలోకి వస్తుందంటూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ.. ఆర్టీఐ ఉద్యమకారుడు ఎస్ సీ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ లో పెట్టింది.
పారదర్శకతలేని వ్యవస్థను ఎవరూ కోరుకోరు. పారదర్శకత పేరుతో న్యాయవ్యవస్థ నాశనమవ్వకూడదు అని విచారణ సందర్భంగా సీజేఐ అన్నారు. ఈ నెల 17న సీజేఐ రంజన్ గొగోయ్ పదవీకాలం ముగియనున్నది. దీంతో రాఫెల్, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లు సహా పలుకీలక కేసుల్లో సుప్రీం ధర్మాసనం తీర్పు ఇవ్వనున్నది.