24 గంటల్లో తేల్చేస్తాం: అయోధ్యపై యోగీ వ్యాఖ్యలు

  • Publish Date - January 26, 2019 / 03:10 PM IST

లక్నో: అయోధ్యలోని రామజన్మభూమి అంశంపై ప్రజలలో ఓపిక బాగా నశిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈవివాదంపై సుప్రీంకోర్టు సాధ్యమైనంత త్వరగా తీర్పు చెప్పాలని,  లేనిపక్షంలో దానిని తమకు అప్పగిస్తే, 24 గంటల్లోనే అంశాన్ని పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. అనవసరమైన జాప్యం సంక్షోభానికి కారణమవుతోందని, ప్రజలు పూర్తిగా సహనం కోల్పోయేందుకు దారి తీస్తుందని  ఆయన అన్నారు.
రామాలయం అంశాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరిస్తారా, లేక కొరడా ఝళిపిస్తారా అని అడిగిన ప్రశ్నకు ‘ముందు కోర్టు మాకు ఆ వ్యవహారం అప్పగించనీయండి’ అని యోగి నవ్వుతూ చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌ నుంచి 2014లో సాధించిన లోక్‌సభ సీట్లు కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తుందని యోగీ ధీమా వ్యక్తం చేశారు.