నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై కేంద్రం ప్రభుత్వం స్పందించింది. దోషులకు ఉరిశిక్ష నిలుపుదల చేస్తూ పటియాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దోషులు చట్టంలోని లొసుగులను ఆధారాం చేసుకుని ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటున్నారని… పటియాలా కోర్టు ఆదేశాలను రద్దు చేసి వీలైనంత త్వరలో వారికి ఉరి తీయాలని హైకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు నలుగురు దోషులతో పాటు తీహార్ జైలు అధికారులకు నోటీసు జారీ చేసి సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైకోర్టు ప్రత్యేక విచారణ జరపనుంది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో హాజరవుతారు.
నిర్భయ దోషి వినయ్ క్షమాభిక్ష పిటిషన్ను శనివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. మరో దోషి అక్షయ్ ఠాకూర్ శనివారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో మళ్లీ ఉరిశిక్ష అమలుకు బ్రేక్ పడినట్లైంది. నిర్భయ కేసులో… నలుగురు దోషులకూ ఒకేసారి ఉరిశిక్ష వెయ్యాలనే రూల్ ఉంది. ఈ రూల్ని అడ్డం పెట్టుకొని దోషులు… ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటున్నారు.
ఫలితంగా ఫిబ్రవరి 1న అమలు కావాల్సిన ఉరిశిక్ష అమలవ్వలేదు. దీనిపై విమర్శలు వస్తుండటంతో… కేంద్రం ఓ అడుగు ముందుకేసింది. కనీసం ఇద్దరికైనా ముందుగా ఉరిశిక్ష అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఢిల్లీ హైకోర్టు గనక నలుగురిలో ఇద్దరికి ముందుగా ఉరిశిక్ష వెయ్యాలని సూచిస్తే… రెండ్రోజుల్లో వారికి ఉరిశిక్ష వేసే అవకాశాలుంటాయి. లేదంటే నలుగురికీ ఒకేసారి శిక్ష అమలు చేయాలని సూచించవచ్చు.
ముందే అనుకున్నట్లుగా జరిగివుంటే… ఈ పాటికే నిర్భయ దోషుల ఉరి పూర్తై… శవాల ఖననం కూడా అయిపోయి ఉండేది. కానీ మన న్యాయ వ్యవస్థలో లొసుగుల్ని అడ్డంపెట్టుకొని దోషులు జాప్యం చేస్తున్నారు.