Aadhaar Linkage Voter ID: ఓటర్ కార్డుతో ఆధార్ సంఖ్య అనుసంధానంకు గడువును పెంచిన కేంద్రం ..
ఓటర్ కార్డుతో అధార్ సంఖ్యను అనుసంధానం చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల విధించిన గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
- Harish Thanniru
- Published on- March 22, 2023 / 01:22 PM IST
Aadhaar Card
Aadhaar Linkage Voter ID: ఓటర్ కార్డు (Voter ID)తో అధార్ (Aadhaar) సంఖ్య అనుసంధానం చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇటీవల గడువు విధించిన విషయం విధితమే. గతేడాది జూన్ 17న న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి ప్రతీఒక్కరూ ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయించుకోవాలని కేంద్రం సూచించింది. అయితే, తాజాగా ఆ గడువును పెంచుతూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు గడువు పెంచింది.
గతేడాది జూన్ 17న కేంద్ర న్యాయశాఖ జారీ చేసిన నోటీసుల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 1 వరకు ఓటర్ ఐడీకి ఆధార్ కార్డు లింక్ ప్రక్రియ పూర్తిచేయాలని పేర్కొంది. నోటిఫికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్ 6-బీను సమర్పించాల్సి ఉంది. అయితే, ఎన్నికల సంఘం ఆగస్టు 1న నమోదైన ఓటర్ ఐడీలతో ఆధార్ కార్డు లింక్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతేడాది డిసెంబర్ 12వ తేదీ వరకు 54.32 కోట్ల ఆధార్ సంఖ్యలను సేకరించినట్లు తెలిసింది. కానీ, వీటిని అనుసంధానించే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో ఓటర్ ఐడీకి ఆధార్ ని లింక్ చేసే గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
PAN-Aadhaar: మార్చి 31లోపు ఆధార్ లింక్ చేయకపోతే పాన్ రద్దు.. ఐటీ శాఖ చివరి హెచ్చరిక
ఓటర్ ఐడీకి ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా బోగస్ ఓట్లను గుర్తించే అవకాశం ఉంటుంది. ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటర్ కార్డులు ఉంటే అవి రద్దవుతాయి. మరోవైపు పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానించే ప్రక్రియకు తుది గడువును పొడిగించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ గడువు సైతం మార్చి 31తో ముగియనుంది. అయితే, ఈ గడువు పెంపుపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
