Fuel Curbs Removal India : రైతులకు భారీ ఊరట.. సాగు ప్రారంభ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న ధరలు..!
Fuel Curbs Removal India : అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో భారతదేశంలో విధించిన అత్యవసర ఇంధన విక్రయాల ఆంక్షలను వెనక్కి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
- Harish Thanniru
- Published on- June 19, 2026 / 08:11 AM IST
Fuel Curbs Removal India
- అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం
- కీలక నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైన కేంద్రంః
- రైతులు, వాహనదారులకు భారీ ఊరట లభించే అవకాశం
Fuel Curbs Removal India : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. రెండు దఏశాల మధ్య అవగాహనా ఒప్పందంపై (ఎంవోయూ) అధికార లాంఛనం పూర్తయింది. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ప్రస్తుతానికి ఎండ్ కార్డ్ పడింది. గత రెండు నెలలుగా ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా ఇన్నాళ్లు హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలు నిలిచిపోవటంతో ప్రపంచ వ్యాప్తంగానేకాక భారత దేశంలో ఇంధన, గ్యాస్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. తాజాగా.. హర్మూజ్ ద్వారా నౌకల ప్రయాణం ప్రారంభం కావడంతోపాటు.. ఇరాన్ నౌకలకు అమెరికా అనుమతులిచ్చింది. దీంతో అన్నివైపుల నుంచి చమురు రవాణా మొదలైంది.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో విధించిన అత్యవసర ఇంధన విక్రయాల ఆంక్షలను వెనక్కి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఈ నిర్ణయంపై ఆలోచనలు జరుగుతున్నాయి. ఈ చర్య అమలైతే రైతులపై భారం తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణం తగ్గేందుకు, ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారత్ కు ఊరట లభించే అవకాశం ఉంది. అయితే, ఒప్పందం అమలు ఎలా జరుగుతుందనే దానిపై మరింత స్పష్టత వచ్చిన తరువాతే ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రం భావిస్తోంది. యుద్ధం తీవ్రరూపం దాల్చిన సమయంలో ప్రబుత్వ ఆదేశాల మేరకు చమురు మార్కెటింగ్ సంస్థలు పలు పరిమితులను అమలు చేశాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ కు 45 రోజుల వ్యవధిని, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల వ్యవధిని నిర్దేశించిన విషయం తెలిసిందే. అలాగే డీజిల్ కొనుగోళ్లపై కూడా పరిమితులు విధించిన కేంద్రం.. ఒక్క వినియోగదారు రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల వరకు మాత్రమే కొనుగోలు చేసేలా నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. అదనంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను కూడా పెంచాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరగడం.. హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు ప్రారభం కావడంతో ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని ప్రజలు భావిస్తున్నారు. అయితే, ధరలను తగ్గించే అంశంపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.
దేశంలో ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఆంక్షల సడలింపు వ్యవసాయ రంగానికి పెద్ద ఊరటనివ్వనుంది. ముఖ్యంగా డీజిల్పై విధించిన పరిమితులు రైతులు, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులపై ఎక్కువ ప్రభావం చూపినట్లు ఇంధన విక్రయ సంస్థలు చెబుతున్నాయి. ఆంక్షలు ఎత్తివేస్తే వ్యవసాయ కార్యకలాపాలు మరింత సులభతరం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
